Delhi Riots:నిరసన తెలపడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు..ఉగ్రవాద చర్యలతో పోలుస్తారా : ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ అల్లర్ల కేసులో పింజ్రాటాడ్ కార్యకర్త నటాషా నర్వాల్, దేవాంగన కళిత మరియు ఆసిఫ్ ఇక్బాల్ తన్హాలకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ మంజూరు చేస్తే ఢిల్లీ న్యాయస్థానం పలు కీలక మరియు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. నిరసనలు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని గుర్తు చేసిన ఢిల్లీ హైకోర్టు... దాన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాలతో (UAPA)పోల్చరాదని వెల్లడించింది. అంటే కేవలం వ్యక్తులు తెలిపే నిరసనలను అణచివేసేందుకు వారిపై చట్టవిరుద్ధమైన లేదా చట్టవ్యతిరేకమైన పనులు చేస్తున్నారని చెప్పి కేసు నమోదు చేయడం తగదని పేర్కొంది. ఇలా కేసులు నమోదు చేయడం వల్ల ఉగ్రవాద చర్యలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు తేడా లేకుండా పోతోందని అదే సమయంలో రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు మరుగున పడుతున్నాయని అభిప్రాయపడింది.
ఒక వేళ ఇదే కనుక కొనసాగితే ప్రజాస్వామ్యంలో చీకటిరోజులు మిగులుతాయని ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది. ఢిల్లీ అల్లర్ల వెనక కుట్రకోణం దాగి ఉందని పేర్కొంటూ పింజ్రాటాడ్ కార్యకర్త నటాషా నర్వాల్, దేవాంగన కళిత మరియు ఆసిఫ్ ఇక్బాల్ తన్హాలపై యూఏపీఏ కేసు నమోదు చేయడం జరిగింది.వీరు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా ఈ కేసును జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ మరియు జస్టిస్ అనూప్ జైరామ్ భంభానీలతో కూడిన ధర్మాసనం విచారణ చేసి పై వ్యాఖ్యలు చేసింది. ఇక ప్రభుత్వం కూడా ఎలాంటి బలమైన సాక్ష్యాధారాలు లేకుండా కక్షసాధింపు చర్యలకు దిగరాదని గట్టిగా చెప్పింది.
ఈ కేసును విచారణ చేసిన సమయంలో ఈ ముగ్గురుపై మోపబడ్డ అభియోగాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రాసిక్యూషన్ కూడా వాస్తవాలను దూరంగా ఉంచి అనుమానాలపై మాత్రమే ఆధారపడినట్లు తమకు అనిపిస్తోందని ధర్మాసనం పేర్కొంది. పింజ్రా టాడ్ కార్యకర్త నటాషా నర్వాల్ మరియు దేవాంగన కళితలు గతేడాది మే నెలలో అరెస్టు కాబడ్డారు. గతేడాది ఫిబ్రవరిలో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు జరుగగా ఆ సమయంలో జరిగిన అల్లర్ల వెనక వీరి హస్తం ఉందని కుట్రలు చేశారన్న ఆరోపణలపై వారిని పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు వీరిపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్లలో బెయిల్ మంజూరైంది.
చిన్న చిన్న అల్లర్ల కేసుల్లో ఉగ్రవాద చర్యలకు ముడిపెట్టి కేసులు నమోదు చేయరాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. యూఏపీఏ చట్టంలో ఉగ్రవాద చర్య నిర్వచనం చాలా పెద్దదని లోతైన అంశమని వెల్లడించింది. చిన్న చిన్న క్రిమినల్ చట్టాలకు దీనికి ముడి వేయరాదని స్పష్టం చేసింది. అంతేకాదు సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ప్రస్తావిస్తూ... హింసాత్మకమైన నిరసనలు కూడా ఉగ్రవాద చర్యలతో సమానం కావని వెల్లడించింది. నిరసనలు చేసే సమయంలో శాంతియుతంగా లేదా అహింసా పద్దతిలో చేపట్టాలని చట్టాలు చెబుతున్నప్పటికీ.. నిరసనకారులు మాత్రం చట్టపరిధిలో ఉండలేరని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం లేదా పార్లమెంటరీ చర్యలపై విస్తృత వ్యతిరేకత ఉన్నప్పుడు తాపజనక ప్రసంగాలు చేయడం, చక్కాజామ్లు నిర్వహించడం సర్వసాధారణం అని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుత కేసులో కూడా అదే జరిగిందని చెప్పిన కోర్టు.. వాటిని ఉగ్రవాద చర్యల కోణంలో చూడరాదని అభిప్రాయపడింది.
ఈ ముగ్గురిపై మోపబడ్డ అభియోగాలపై కూడా దృష్టి సారించిన కోర్టు.. కేవలం నిరసనల్లో పాల్గొన్నారన్న అభియోగాలు మాత్రమే మోపారని వీరు ఫలానా చర్యలకు పాల్పడ్డారు లేదా వ్యాఖ్యలు చేశారు అనే అంశాలు కూడా లేవని పేర్కొంది. ఇక యూఏపీఏ అభియోగాలున్న కేసులను విచారణకు తీసుకునే ముందు కింది కోర్టులు కూడా పునఃపరిశీలించిన తర్వాతే విచారణ చేపట్టాలని వెల్లడించింది. ఉగ్రవాద చర్యలు ఉన్న కేసులను చాలా సీరియస్గా పరిగణించాలని పేర్కొంది. వీటికి కఠిన శిక్షలు అమలు చేయాలని కోర్టు పేర్కొంది. ముందు రెండు ఎఫ్ఐఆర్లను ఆధారంగా చేసుకునే ఎఫ్ఐఆర్ 59/2020 నమోదైందని తెలిపిన కోర్టు.. ముందు కేసులో బెయిల్ మంజూరు అయ్యిందన్న విషయాన్ని గుర్తు చేసింది.