అమిత్ షా నిర్ణయాన్ని అమలు చేయడం అసాధ్యం: రజినీకాంత్: మొదటిసారి బీజేపీకి వ్యతిరేకంగా!
చెన్నై: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో హిందీని తప్పనసరిగా అమలు చేయాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన పట్ల చెలరేగిన దుమారం ఇప్పట్లో తగ్గేలా లేదు. ప్రత్యేకించి- దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ సహా వామపక్ష పార్టీల నాయకులు ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. సాక్షాత్తూ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సైతం.. అమిత్ షా తీసుకున్న నిర్ణయం సరైనది కాదని తేల్చి చెప్పారు. కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం, తమిళనాడుకు చెందిన డీఎంకే, మక్కళ్ నీథి మయ్యం అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ దీనిపై స్పందించారు. తాజాగా- ఇదే విషయంపై దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం తన నోరు విప్పారు. బీజేపీ సానుభూతిపరునిగా గుర్తింపు ఉన్న రజినీకాంత్.. ఆ పార్టీ సుప్రిమో నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఇదే తొలిసారి.
వీడియో: నంద్యాల వీధుల్లో మొసలి: కుందూనది వరద ప్రవాహం నుంచి వచ్చిన అనుకోని అతిథి!
దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ భాషను అమలు చేయడం అసాధ్యమని రజినీకాంత్ స్పష్టం చేశారు. తమిళనాడు సహా దక్షిణాదిలోని ఏ ఒక్క రాష్ట్రంపైనా హిందీని బలవంతంగా రుద్దడం సరికాదని చెప్పారు. బుధవారం ఆయన చెన్నైలో విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఒకే భాష ఉండటం మంచిదే అయినప్పటికీ.. విభిన్న సంస్కృతులు, వేర్వేరు భాషలను మాట్లాడుతున్న భారత్ లో అది సాధ్యపడదని అన్నారు. హిందీ మాత్రమే కాదు..
ఏ భాషనైనా దేశం మొత్తం మీద అమలయ్యేలా చేయడం సరికాదని రజినీకాంత్ స్పష్టం చేశారు. బలవంతంగా అమలు చేయాల్సి వస్తే.. ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుందని చెప్పారు. కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు కూడా హిందీని అమలు చేయడానికి ముందుకు వస్తాయని తాను అనుకోవట్లేదని అన్నారు. హిందీని బలవంతంగా రుద్దాల్సి వస్తే.. తమిళనాడులో మరో జల్లికట్టు తరహా ఉద్యమం తలెత్తుతుందంటూ కమల్ హాసన్ ఇదివరకే కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే.