40 సీట్లతోనే నితీష్ కుమార్ సీఎం అవుతారా? ఆ కలలు ఎన్ని రోజులో?: ఆర్జేడీ నేత వ్యంగ్యాస్త్రాలు
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జేడీ అధినేత నితీష్ కుమార్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఆర్జేడీ సీనియర్ నేత మనోజ్ ఝా. కేవలం 40 సీట్లు సాధించిన నితీష్ కుమార్ ముఖ్యమంత్రి సీటుపై కూర్చోవాలని కలలుకంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఆయన ఎలాంటి స్తితిలో ఉన్నారో గుర్తు చేసుకోవాలన్నారు.
ఒకవేళ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణం చేసినా.. ఆ పదవిలో ఆయన ఎన్ని రోజులు ఉంటారనేది మాత్రం ఆ దేవుడికే తెలియాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
'పబ్లిక్ నిజంగా మాస్టర్, కానీ వారు మిమ్మల్ని ఉంచిన పరిస్థితిని చూడండి. మీరు (నితీష్ కుమార్) 40 సీట్లు పొందిన తరువాత సిఎం కావాలని కలలుకంటున్నారు. మీరు పరిస్థితిని విశ్లేషిస్తే, అది మీకు వ్యతిరేకంగా ఉంటుంది. మీకు ఇంకా పదవి వస్తే, ఈ భ్రమ ఎంతకాలం ఉంటుందో దేవునికి మాత్రమే తెలుసు ' అని మనోజ్ ఝా పేర్కొన్నారు.
'చాలా కొద్ది మందికి నాల్గవసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభిస్తుంది, ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు బీహార్ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ. 'బీహార్ ప్రజలు నాల్గవసారి ఎన్డీఏపై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేసినందుకు నా కృతజ్ఞతలు. ఇది సాధారణమైనది కాదు. భారతీయ రాజకీయాల్లో నాల్గవసారి ప్రజలు విశ్వసించిన సీఎంలు చాలా తక్కువ'అ ని అన్నారు.
కాగా,ఇటీవల బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 125 స్థానాల్లో విజయం సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక గట్టిగా పోరాడిన ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమికి 110 స్థానాలు దక్కాయి. ఎన్డీఏలోని బీజేపీ 74 స్థానాల్లో గెలుపొందగా, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీ మాత్రం కేవలం 43 స్థానాల్లోనే గెలుపొందింది. జేడీయూ 115 స్థానాల్లో పోటీ చేయడం గమనార్హం. బీజేపీ 110 స్థానాల్లోనే పోటీ చేసింది.