తొగాడియా వార్నింగ్: నాలుగు నెలల్లో రామమందిరం నిర్మించాలి.. లేదంటే సత్తా చూపుతాం
విశ్వహిందూ పరిషత్ బహిష్కృత నేత ప్రవీణ్ తొగాడియా మోడీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. 2014లో మోడీ ఇచ్చిన సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదం బూటకమని ఆయన విమర్శించారు. మోడీలా తను ప్రజలను మోసం చేసే వ్యక్తిని కానని చెప్పిన తొగాడియా... తనది హిందూకా సాత్ హిందూ కా వికాస్ నినాదమని చెప్పారు. తన సొంత పార్టీ అంతర్జాతీయ హిందూ పరిషత్ ప్రకటన కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తొగాడియా ఈ వ్యాఖ్యలు చేశారు.
తన పార్టీ హిందువుల శ్రేయస్సు కోసం పనిచేస్తూనే అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం కృషి చేస్తుందని చెప్పారు. సోమ్నాథ్ ఆలయం ఎలా అయితే నిర్మించారో అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం కొత్త చట్టం ప్రభుత్వం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రామమందిరం నిర్మాణం చేస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ పొందుపరిచిందని కానీ ఆహామీని మరిచిందని తొగాడియా విమర్శించారు.
ఇప్పటికే నాలుగు సంవత్సరాలు గడిచాయని మండిపడ్డ తొగాడియా.... రామమందిర నిర్మాణం కోసం ప్రభుత్వం ఎలాంటి చట్టం తీసుకురాలేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం హిందూ ప్రజలను నమ్మించి మోసం చేస్తోందని.. అదే రీతిలో రాముడిని కూడా మోసం చేసిందని తొగాడియా ఫైర్ అయ్యారు. న్యాయనిపుణులతో కలిసి రామమందిర నిర్మాణం కోసం కొత్త ముసాయిదా తయారు చేయించినట్లు చెప్పిన తొగాడియా....దీన్ని అయోధ్యలోని రాముడి పాదాల చెంత ఉంచుతానని చెప్పారు. అనంతరం 20 కోట్ల హిందూ ప్రజల ఆమోదం కోసం ఈ ముసాయిదాను వారిముందు ఉంచుతామన్నారు. వచ్చే నాలుగు నెలల్లో రామమందిరం నిర్మాణంపై అడుగులు ముందుకు వేయకుంటే... ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలను ప్రభుత్వం ఎదుర్కోవల్సి ఉంటుందని హెచ్చరించారు.
Recommended Video
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి మద్దతు తెలిపిన షియా వక్ఫ్ ఛైర్మెన్ వసీమ్ రిజ్వీ, బీజేపీ ఎమ్మెల్సీ బుక్కల్ నవాబ్లపై కూడా తొగాడియా విమర్శలు సంధించారు. వారిద్దరి మద్దతు తమకు అవసరం లేదని... అసలు వారు హిందువులు కాదని తనదైన శైలిలో వ్యవహరించారు తొగాడియా.