సిగ్గనిపించట్లేదా?: ఢిల్లీ కాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కడిగిపారేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నెలకొన్న తీవ్ర వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపాటు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేయకుండా అడ్డుకోలేరా? అంటూ మండిపడింది. అక్కడ పంట వ్యర్థాల దహనాన్ని అడ్డుకుంటే ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గిపోతుంది కదా అని ప్రశ్నించింది.
కాలుష్యం ఎఫెక్ట్: దేవీదేవతలూ మాస్కులు ధరించారు! ఎక్కడంటే..?
మీకు సిగ్గనిపించట్లేదా?
విమానాల దారి మళ్లింపు, ప్రజలు తమ నివాసాల్లో కూడా సురక్షితంగా ఉండకపోవడంపై మీకు సిగ్గు అనిపించడం లేదా? అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోట్లాది ప్రాణాలకు సంబంధించిన విషయంపైనా సరైన విధంగా స్పందించరా? అంటూ మండిపడింది.
ఇకనైనా చర్యలు తీసుకోండి..
ఈ విషయంలో ప్రభుత్వాల నుంచి అవసరమైన చర్యలను ఆశిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. పంట వ్యర్థాలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన విధంగా స్పందించివుంటే గాలి కాలుష్యం ఇంత తీవ్రతరం కాకుండా ఉండేది కదా? అని ప్రశ్నించింది. పంట వ్యర్థాలను దహనం చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఇదో సంస్థాగత పాపం..
పంట దహనం అనేది ప్రతి ఏడాది జరుగుతున్న సంస్థాగత పాపం అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పంట దహనాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తమకు ఏడు రోజుల్లోగా తెలియజేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. పంట వ్యర్థాలను రైతుల నుంచి ప్రభుత్వాలే కొనుగోలు చేయవచ్చు కదా? ప్రభుత్వ యంత్రాంగాలు పంట వ్యర్థాలను దహనం చేయకుండా ఎందుకు అడ్డుకోవడం లేదని సుప్రీంకోర్టు నిలదీసింది.
మీరు మీ కూర్చీని ఖాళీ చేయండి..
సంక్షేమ ప్రభుత్వం అనే భావన మీరు మర్చిపోయారా? పేదల ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనుకున్నారా? అని సుప్రీంకోర్టు మండిపడింది. ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. పంట వ్యర్థాలను కొనుగోలు చేసేందుకు, వాటిని ఉపయోగించుకునేందుకు తమ వద్ద యంత్రాంగం, నిధులు లేవని పంజాబ్ చీఫ్ సెక్రటరీ సుప్రీంకోర్టుకు చెప్పగా.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉందని పంజాబ్ సీఎస్ కోర్టుకు తెలిపారు. దీంతో మరోసారి మండిపడిన జస్టిస్ మిశ్రా.. ఇందు కోసం మీరు నిధులు కేటాయించలేకపోతే.. వెంటనే మీరు మీ కూర్చి నుంచి వైదొలగిపోండి అంటూ తేల్చి చెప్పారు. మీకు మీ ప్రాధాన్యతలేంటో కూడా తెలియదంటూ సీరియస్ అయ్యారు.
భవంతుల్లో కూర్చుంటే సరిపోతుందా..?
అవసరమైన యంత్రాలు కొనుగోలు చేసేందుకు మీ వద్ద నిధులు లేకపోతే.. మేమే మీకు నిధులు అందజేస్తామని జస్టిస్ మిశ్రా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఆధారపడటం మానుకోవాలని, మీరు ఏమీ చేయలేకపోతే.. ఆ విషయాన్ని కోర్టులకు వదిలేయాలని స్పష్టం చేశారు. పంట వ్యర్థాలను దహనం చేసే రైతులను శిక్షించడం అనేది సమస్యకు పరిష్కారం కాదని స్పష్టం చేశారు. వారికి కావాల్సిన సదుపాయాలను కల్పించాలని చెప్పారు. మీరు భవంతుల్లో కూర్చుని ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదనుకుంటే.. మీ ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుంది.. మీ ప్రాణాలకు పోకుండా ఉండాలంటే మీరు ఏదో ఒకటి చేయాలని ప్రభుత్వాధినేతలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.