దిమ్మతిరుగుతుంది: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ రోజు సంపాదన ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: భారత దేశంలోనే అత్యంత ధనవంతుడుగా పేరుగాంచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఒక్క రోజు సంపాదన ఎంతో తెలిస్తే నోరెళ్ల బెడతారు. ఆయన రోజుకు ఈజీగా రూ. 300 కోట్లు సంపాదిస్తున్నారట. ఏంటి షాక్ అయ్యారా... అవును రోజుకు 100 రూపాయలు సంపాదించాలంటే కష్టమవుతున్న ఈ రోజుల్లో ఈ అపరకుబేరుడు ఏకంగా రూ.300 కోట్లు సంపాదిస్తున్నట్లు బార్క్లేస్ హరున్ ఇండియా రిచ్ చేపట్టిన సర్వేలో వెల్లడైంది.
ముగ్గురు ఆస్తులు కలిపితే ముఖేష్ అంబానీ ఆస్తి
రూ.3,71,000 కోట్ల ఆస్తితో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మెన్ ముఖేష్ అంబానీ వరుసగా ఏడోసారి భారతదేశంలో అత్యంత ధనికుడిగా నిలిచారు. తన కంపెనీ షేర్ విలువ కూడా 45శాతం పెరిగింది. ముఖేష్ ఆస్తులు ఏ స్థాయిలో ఉన్నాయంటే... ఆయన తర్వాత ధనికుల్లో నిలిచిన హిందూజా (రూ.1,59,000 కోట్లు), మిట్టల్ మరియు ఆయన కుటుంబం (రూ.1,14,500 కోట్లు), అజీజ్ ప్రేమ్జీ(రూ.96,100కోట్లు) ఈ ముగ్గురు ఆస్తులు కలిపితే ఎంత అవుతుందో అంతగా ముఖేష్ ఆస్తిగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది.
రూ.1000 కోట్లు ఆస్తులున్న వారి సంఖ్య 831
భారతదేశంలో రూ.1000 కోట్లు ఆస్తులున్న వారిపై బార్క్లేస్ హరున్ ఇండియా రిచ్ సర్వే చేపట్టింది. 2017 దేశంలో మొత్తం రూ.1000 కోట్లు పైబడి ఉన్న వ్యక్తుల సంఖ్య 617 ఉండగా... 2018లో ఆ సంఖ్య 831కి పెరిగింది. సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ ఈసారి జాబితాలో ఐదో స్థానానికి పడిపోయారు. ఆయన కంపెనీ షేర్ విలువ 50 శాతానికి పడిపోయింది. ఏప్రిల్ 2018లో సంఘ్వీ యూనీకెమ్ లాబొరేటరీస్కు సంబంధించి 3.8శాతం వాటాను కొనుగోలు చేశారు. ప్రస్తుతం సంఘ్వీ ఆస్తులు రూ. 89,700 కోట్లు ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.
అంబానీ కుటుంబం ఫస్ట్...ఎన్ఆర్ఐలో హిందూజా కుటుంబం టాప్
ఇక ఇది ఇలా ఉంటే... దేశంలో అతి సంపన్న కుటుంబాలను కూడా ఏమిటో తెలిపింది సర్వే. దీని ప్రకారం... అంబానీ కుటుంబం తొలి స్థానంలో ఉండగా..గోద్రెజ్, హిందూజా, మిస్త్రీ, సంఘ్వీ, నాడార్, అదాని, దమాని, లోహియా, బర్మన్ కుటుంబాలు నిలిచాయి.
ఇక ఎన్ఆర్ఐలో 66 మంది సంపన్నులున్నట్లు పేర్కొంది. ఇందులో 65శాతం మంది స్వయంగా ఎదిగిన వారు కావడం విశేషం. ఎన్ఆర్ఐలలో యూఏఈలో ఉండేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. ఇక్కడ 21 మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఆ తర్వాత అమెరికా, యూకే దేశాలనే ఎక్కువగా ఉండేందుకు ఇష్టపడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఇక ఎన్ఆర్ఐ కుటుంబాల్లో ధనిక ఎన్ఆర్ఐ కుటుంబంగా నిలిచింది ఎస్పీ హిందూజా కుటుంబం. వీరి ఆస్తులు రూ.1,59,000 కోట్లు .ఇక యూఏఈలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ యూసఫ్ అలి మా రూ.39,200 కోట్లతో అత్యంత సంపన్న ఎన్ఆర్ఐగా రికార్డు సృష్టించాడు. రూపాయి విలువ పతనం అవుతున్నప్పటికీ భారత్లో మాత్రం సంపన్నుల సంఖ్య తగ్గడం లేదు. ఇది చాలా ఆసక్తికరంగా మారింది.