ఢిల్లీ స్కూలుకు మెలానియా ఎందుకు వెళ్లాలనుకుంటోందో తెలుసా..?
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు సోమవారం రానున్నారు. నేరుగా అహ్మదాబాద్లో ఆయన విమానం ల్యాండ్ అవుతుంది. ఇక మంగళవారం ఢిల్లీకి వచ్చిన సందర్భంలో ప్రధాని మోడీతో హైదరాబాద్ హౌజ్లో ట్రంప్ బిజీగా సమావేశం కానుండగా... అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మాత్రం మరోచోట బిజీగా గడుపుతారు. ఇంతకీ ఆ చోటు ఏంటి..?
ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలకు మెలానియా ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ అహ్మదాబాద్లో ల్యాండ్ అవుతుంది. అక్కడ నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొని తాజ్మహల్ను సందర్శించి అనంతరం ఆయన ఢిల్లీకి వెళతారు. మంగళవారం రోజున ఆయన ప్రధానితో సమావేశంలో ఉండగా ఆ సమయంలో మెలానియా ట్రంప్ ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తారు. అక్కడ ఆమె ఢిల్లీ సర్కార్ ప్రవేశపెట్టిన హ్యాపీ కరుక్యులమ్ గురించి తెలుసుకుంటారు. అంతేకాదు హ్యాపినెస్ క్లాసులు సైతం అటెండ్ అవుతారు. అదే సమయంలో పిల్లలతో ముచ్చటిస్తారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాలు మెలానియాకు హ్యాపీ కరుక్యులమ్ గురించి వివరిస్తారు. అంతేకాదు విద్యార్థులకు బోధన ఎలా చేస్తారనే దానిపై మెలానియాకు వివరిస్తారు. ఒక అగ్రరాజ్యం తొలిమహిళ ఇలా పిల్లలతో ముచ్చటించడం ఇదే తొలిసారి.
మెలానియా ఏ స్కూలుకు వెళుతున్నారు..?
ఇదిలా ఉంటే అమెరికా ప్రథమ మహిళా ఏ స్కూలుకు వెళుతుందో ఇప్పటివరకు అధికారులు బయటకు వెల్లడించలేదు. భద్రతాకారణాల దృష్ట్యా ఈ విషయాన్ని వెల్లడించలేదు. అయితే ఢిల్లీలోని దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలు ముస్తాబవుతున్నాయి. స్కూళ్లకు రంగులు, ఇతరత్రా మరమత్తులు చేస్తున్నారు. అయితే మెలానియా తమ స్కూలంటే తమ స్కూలుకు రావాలని టీచర్లు ఆశపడుతున్నారు. హ్యాపీ కరుక్యులమ్తో ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు వచ్చాయని అవన్నీ మెలానియాకు వివరించాలని టీచర్లు ఆతురతతో ఎదురు చూస్తున్నారు.
Recommended Video
హ్యాపీగా ఉన్న హ్యాపీ కరుక్యులమ్
హ్యాపీ కరుక్యులమ్తో విద్యార్థుల్లో చాలా మార్పు వచ్చింది. అదే సమయంలో వారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరిగాయి. హ్యాపీ కరుక్యులమ్లో భాగంగా గ్రాటిట్యూడ్ వాల్ అనే ఎక్సర్సైజ్ చేయడం జరుగుతోంది. ఇందులో ప్రతి విద్యార్థి తమ జీవితంలో జరిగిన ఘటనలను మరొకరితో పంచుకుంటారు. ఇక కొన్ని సార్లు కళ్లు మూసుకుని తమ పరిసరాల్లో వినిపించే శబ్దాలను జాగ్రత్తగా పరిశీలించాలని కోరుతారు. ఆ సమయంలో మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఎప్పుడైనా ఒత్తిడికి గురైతే ఈ తరహా వ్యాయామం చాలా ఉపయోగపడుతుందని విద్యార్థులు చెబుతున్నారు. ఇక హ్యాపీ కరుక్యులమ్తో విద్యార్థులు చాలా నేర్చుకున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. థాంక్యూ చెప్పడం, క్షమించడం వంటి జీవన సూక్తులను నేర్చుకున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక స్కూల్ క్యాంపస్లను చాలా శుభ్రంగా ఉంచుతున్నారని టీచర్లు చెబుతున్నారు. ఇదంతా హ్యాపీ కరుక్యులమ్తోనే సాధ్యమైందన్నారు.