'మామ్' సక్సెస్: సైంటిస్ట్కి ఆటోడ్రైవర్ సర్ప్రైజ్, ప్రశ్నలతో
బెంగళూరు: మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) విజయవంతమైన నేపథ్యంలో యావద్భారతదేశం ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. మామ్ విజయం భారత్లోని ప్రతి ఇంటికి చేరిందని, ప్రతి ఇంట్లో సంతోషం కనిపించిందనేందుకు ఓ ఉదాహణ ఉంది!
ఇస్రో శాస్త్రవేత్త వివేక్ పీ నంబియార్ ఇదే అభిప్రాయాన్ని ఫేస్బుక్లో వ్యక్తం చేశారు. అందుకు ఓ ఉదాహరణ కూడా చెప్పారు. తనను ఓ ఆటో డ్రైవర్ ఉచితంగా తీసుకు వెళ్లాడని చెప్పారు.
బుధవారం సాయంత్రం వివేక్ పీ నంబియార్ ఇస్రో కార్యాలయం ముందు ఓ ఆటో ఎక్కారు. బెంగళూరు ఆటో డ్రైవర్లు పాసింజర్ల వద్ద ఎక్కువ డబ్పులు వసూలు చేస్తారనే అపవాదు ఉంది. ఇది తెలిసిన వివేక్ పీ నంబియార్ ముందే సదరు ఆటో డ్రైవర్కు ఎంత అయితే అంతే ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
అయితే, వివేక్ పీ నంబియార్ ఇస్రో కార్యాలయం లోపలి నుండి వచ్చి ఎక్కడం చూసిన ఆటో డ్రైవర్.. మీరు ఇందులో పని చేస్తారా అని అడిగారు. దానికి వివేక్ పీ నంబియార్ అవునని సమాధానం ఇచ్చారు. మాటల్లో ఆటో డ్రైవర్ మార్స్ గురించి కొన్ని వివరాలు చెప్పి శాస్త్రవేత్తను ఆశ్చర్యానికి లోను చేశారు. ఓ ఆటో డ్రైవర్ మార్స్ గురించిన విషయాలు చెప్పడం వివేక్ పీ నంబియార్ను విస్మయానికి గురి చేసింది.
వివేక్ పీ నంబియార్ అదే ఆటోలో ఎక్కారు. ఆటో డ్రైవర్.. వివేక్ పీ నంబియార్ను మార్స్ గురించి పలు ప్రశ్నలు అడిగాడు. మామ్ ఇంజిన్ గురించి, దాని ఫంక్షన్ గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత కాసేపటికి సైంటిస్ట్ తాను వెళ్లేచోట దిగారు. అతను డబ్బులు ఇవ్వబోగా ఆటో డ్రైవర్ నిరాకరించారు. అంతేకాదు.. సర్! మీరు మేం గర్వించేలా చేశారని, మీలాంటి వారి నుండి నేను డబ్బులు తీసుకోనని డ్రైవర్ చెప్పారు. అతను డబ్బులు తీసుకోకుండానే అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని వివేక్ పీ నంబియార్ ఫేస్బుక్లో పంచుకున్నారు.