ప్రైవేట్ బ్యాంకుల షాక్: నగదు లావాదేవీలపై పరిమితి, మించితే ఛార్జీల మోత
నెలకు నాలుగు వరకు ఉచిత నగదు లావాదేవీలను అనుమతిస్తున్న హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర బ్యాంకులు.. నగదు ఉపసంహరణ లేదా నగదు డిపాజిట్లు ఆ పరిమితికి మించితే ఒక్కో లావాదేవీపై బుధవారం నుంచి రుసుముగా
న్యూఢిల్లీ: ప్రైవేటు బ్యాంకులు మరోసారి ఖాతాదారులకు మరో షాకిచ్చాయి. నెలకు నాలుగు వరకు ఉచిత నగదు లావాదేవీలను అనుమతిస్తున్న హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర బ్యాంకులు.. నగదు ఉపసంహరణ లేదా నగదు డిపాజిట్లు ఆ పరిమితికి మించితే ఒక్కో లావాదేవీపై బుధవారం నుంచి రుసుముగా కనీసం రూ.150 వసూలు చేస్తున్నాయి.
సేవింగ్, శాలరీ ఖాతాలకూ ఈ రుసుము వర్తిస్తుందని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఒక సర్క్యులర్లో పేర్కొంది. థర్డ్ పార్టీ నగదు లావాదేవీలను ఈ బ్యాంకు రోజుకు రూ.25వేలకు పరిమితం చేయనుంది. ఐసీఐసీఐ వెబ్సైట్లో ఉంచిన వివరాల ప్రకారం.. హోం బ్రాంచిలో ఒక నెలలో తొలి నాలుగు నగదు లావాదేవీలకు రుసుము ఉండదు. ఆ తర్వాత నుంచి ప్రతి రూ.వెయ్యికి రూ.5 వసూలు చేస్తారు. కనీస రుసుము రూ.150గా నిర్ణయించింది.
అంతేగాక, థర్డ్ పార్టీ నగదు లావాదేవీల పరిమితిని రోజుకు రూ.50వేలుగా నిర్ణయించింది. హోం బ్రాంచి కాని వాటిల్లో నెలలో తొలి నగదు లావాదేవీ ఉచితమని ఐసీఐసీఐ తెలిపింది. ఆ తర్వాత నుంచి రూ.1000కి రూ.5 రుసుము వసూలు చేస్తారు. కనీస రుసుము రూ.150గా ఉంటుంది. నగదు స్వీకరించే యంత్రంలో నెలలో తొలి జమకు రుసుము ఉండదు. ఆ తర్వాత రూ. వెయ్యికి రూ.5 వసూలు చేస్తారు.
ఇక యాక్సిస్ బ్యాంకు విషయానికొస్తే.. తొలి ఐదు లావాదేవీలు లేదా రూ.10లక్షల నగదు డిపాజిట్లు లేదా ఉపసంహరణలకు రుసుము ఉండదు. ఆ తర్వాత రూ.150 లేదా రూ.వెయ్యికి రూ.5 ఏది ఎక్కువయితే ఆ మొత్తం రుసుముగా వసూలు చేస్తారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా రుసుములు వసూలు చేస్తున్నయా లేదా అన్నదానిపై అధికారిక సమాచారం లేదు. ఇటువంటి రుసుములు వసూలు చేయాలని బ్యాంకులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశమూ లేదని సీనియర్ అధికారి ఒకరు చెప్పడం గమనార్హం. కాగా, బ్యాంకులు ఇలా నగదు లావాదేవీలపై పరిమితులు పెట్టి, రుసుములు వసూలు చేస్తుండటంపై ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.