సత్యం స్కాం: రామలింగ రాజుకు చుక్కలు, కొన్ని కీలక అంశాలు
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ వ్యవహారంలో బాగా దెబ్బతిన్నది ఆ కంపెనీ షేర్లు కొనుక్కొని, వాటిని అమ్మేసిన ఇన్వెస్టర్లేనని చెప్పవచ్చు. సత్యం రామలింగ రాజు 2009 జనవరి 7న తాను అవతవకలకు పాల్పడినట్లు లేఖ రాశారు. దీంతో అప్పటి వరకు రూ.544గా ఉన్న సత్యం షేరు ధర అనూహ్యంగా పడిపోయింది. ఆ తర్వాత ఏకంగా రూ.12కు పడిపోయింది.
రామలింగ రాజు లేని ఆస్తుల్ని, రాని లాభాలను, లేని ఉద్యోగాలను చూపించాడు. దీంతో షేర్ ధరలు అమాంతం పెరుగుతూ పోయాయి. అలా షేర్ల ధరలు పెరిగిన సందర్భాల్లో వాటాలు అమ్ముకున్న వారు లబ్ధి పొందారనే చెప్పవచ్చు. అందులో ముందున్నది రామలింగ రాజు, అతనికి సంబంధించిన వారు.
కంపెనీ వాస్తవ విలువ రూ.మూడు వందల కోట్లకు అటు ఇటుగా ఉంటే, రామలింగ రాజు మాత్రం రూ.5,300 కోట్లు చూపించాడు. లేని విలువ రూ.ఐదువేల కోట్లకు చేరుకోవడంతో దానికి ముగింపు పలకాలనుకున్నాడు. అందుకే తన కుటుంబానికి చెందిన మెటాస్ ఇన్ ఫ్రా, మెటాస్ ప్రాపర్టీస్ను రూ.7,690 కోట్లకు కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకున్నాడు.
ఆ డీల్ ఒకే అయితే, అందులో 'లేని' రూ.ఐదువేల కోట్లను మెటాస్కు చెల్లించకుండా చెల్లించాలని లెక్కలు చూపించాలని రామలింగ రాజు భావించాడని అంటారు. అలా ఆ డీల్ ఒకే అయితే, ఈ కుంభకోణం బయటపడకపోయి ఉండేదేమో అనే వాదనలు ఉన్నాయి. ఈ డీల్ను మిగతా వాటాదారులు వ్యతిరేకించారు.
రామలింగ రాజు
సత్యం కుంభకోణం కేసులో రామలింగ రాజుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష, ఐదు కోట్ల రూపాయల జరిమానా విధించింది.
రామరాజు
సత్యం కుంభకోణం కేసులో రామరాజుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష, ఐదు కోట్ల రూపాయల జరిమానా విధించింది.
వడ్లమాని శ్రీనివాస్
సత్యం కుంభకోణం కేసులో వడ్లమాని శ్రీనివాస్కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష, 25 లక్షల రూపాయల జరిమానా విధించింది.
గోపాల కృష్ణన్
సత్యం కుంభకోణం కేసులో గోపాల కృష్ణన్కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష, 25 లక్షల రూపాయల జరిమానా విధించింది.
తాళ్లూరి శ్రీనివాస్
సత్యం కుంభకోణం కేసులో తాళ్లూరి శ్రీనివాస్కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష, 25 లక్షల రూపాయల జరిమానా విధించింది.
రామకృష్ణ
సత్యం కుంభకోణం కేసులో రామకృష్ణకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష, 25 లక్షల రూపాయల జరిమానా విధించింది.
ప్రభాకర్ గుప్తా
సత్యం కుంభకోణం కేసులో ప్రభాకర్ గుప్తాకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష, 25 లక్షల రూపాయల జరిమానా విధించింది.
రామలింగ రాజు - నాటి సత్యం
రామలింగ రాజు 1954, సెప్టెంబర్ 16న జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, గంగపర్రు స్వగ్రామం. 35 ఏళ్ల క్రితం రామలింగ రాజు తండ్రి హైదరాబాద్ వచ్చారు. రామలింగ రాజు 1987జూన్ 24న సత్యం కంప్యూటర్స్ను 20 మంది ఉద్యోగులతో ప్రారంభించాడు. 2007 నాటికి ఆస్తులు 2.1 బిలియన్ డాలర్లు. 10 కేంద్రాలు, 66 దేశాల్లో సత్యం అప్పటికి విస్తరించింది. మొత్తం ఉద్యోగులు 53వేలు అని చెప్పారు. కానీ విచారణలో 40వేలుగా తేలింది.
అంతర్జాతీయంగా 654 పైగా సంస్థలు, 50కి పైగా సంస్థల్లో సాంకేతిక, మార్కెటింగ్ భాగస్వామ్యం ఉండేది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో నమోదయిన కంపెనీ. 2001లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, యూరోనెక్ట్స్ లిస్టుల్లో చేరింది. 2008లో గోల్డెన్ పీకాక్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత ఏడాదే ఆదాయాన్ని ఎక్కువ చేసి చూపానని రామలింగ రాజు రాజీనామా చేశాడు.
సత్యం కంప్యూటర్స్ పతనానికి ముందు రామరాజు కుమారులు తేజరాజు, రామరాజులు ప్రమోట్ చేసిన మెటాస్ ఇన్ ఫ్రా 51 శాతం వాటాను, మెటాస్ ప్రాపర్టీస్లో 100 శాతం వాటాను కొనుగోలు చేయాలని రామలింగ రాజు భావించారు. కానీ దీనిని ఇన్వెస్టర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో రామలింగరాజు దానిని విరమించుకున్నాడు.
చుక్కలు చూపిన ఇన్వెస్టర్
సత్యం కుంభకోణంపై కేసు బుక్ చేయించింది ఇన్వెస్టర్ లీనా మంగత్ అనే విషయం తెలిసిందే. ఆమె సత్యం కంప్యూటర్స్ ప్రమోటర్లు దివాలా ప్రకటించేందుకు నాలుగేళ్ల ముందే ఆ కంపెనీకి చెందిన 100 షేర్లు కొన్నారు. రామలింగ రాజు లేఖ అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, సీఐడీ, సీబీఐ రంగంలోకి దిగాయి. చెన్నైకు చెందిన గోకుల్ ప్రసాద్ అనే మరో ఇన్వెస్టర్ హైదరాబాద్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యం నిందితులకు శిక్ష పడేందుకు దాదాపు ఏడేళ్లు పట్టింది.