అయోద్యలో ఏర్పాటు కానున్న ఈ భారీ రాముడి విగ్రహం గురించి తెలుసుకోండి
దేశంలో విగ్రహాల ఏర్పాటు ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ఒకప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహాలు బాగా కనిపించగా ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలు పెద్ద సంఖ్యలో ప్రతి ఊర్లో దర్శనమిస్తున్నాయి. ఇక కేంద్రంలో ఎన్డీయే సర్కార్ వచ్చాక స్వాతంత్ర్య సమరయోధులు, ప్రముఖులు, దేవతల విగ్రహాల ప్రతిష్టకు పెద్ద పీట వేస్తోంది. గతనెల స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఇక అప్పటి నుంచి విగ్రహాల ఏర్పాటుపై చర్చ జోరుగా సాగుతోంది.
అయోధ్యలో రామమందిర నిర్మాణం ఏర్పాటు పై జోరుగా చర్చ జరుగుతున్న సమయంలోనే ఉత్తర్ ప్రదేశ్లో యోగీ సర్కార్ భారీ రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని పొడవు 221 మీటర్లు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పొడవైన విగ్రహంగా 182 మీటర్ల సర్దార్ పటేల్ విగ్రహం ఉండగా స్టాచ్యూ ఆఫ్ ది మర్యాద పురుషోత్తమ్ పేరుతో అయోధ్యలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని యోగి సర్కార్ భావిస్తోంది.
ఇక స్టాచ్యూ ఆఫ్ ది మర్యాద పురుషోత్తమ్ విగ్రహం ఒక సారి చూస్తే ఇందులో రాముడి విగ్రహం 151 మీటర్ల పొడువు ఉంటుంది. దానిపై గొడుగు 20 మీటర్లు ఉంటుదట.విగ్రహం పునాది మరో 50 మీటర్ల ఎత్తు ఉంటుందని ఆ రాష్ట్ర సమాచార శాఖ ముఖ్య కార్యదర్శి అవనీష్ అవస్థి తెలిపారు. విగ్రహం కింది భాగంలో అయోధ్యతో పాటు ఇక్ష్వాకు వంశ చరిత్రకు సంభించిన విశేషాలతో ఓ మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు అవస్థి తెలిపారు.