కండీషన్స్ అప్లై: ఇక్కడ చీరెలు కొనుగోలు చేయలంటే ఆధార్ కార్డు తప్పనిసరి
చీరెలు అంటే ఇష్టపడని భారతీయ స్త్రీలు ఉండరు. చీర కట్టు ఒక్క భారత్లోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా చాలా పాపులర్ . పాశ్చాత్యదేశ మహిళలు భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు చీరెను కట్టుకోవాలని చాలా ఆశపడుతుంటారు. ఇది పక్కన బెడితే... ఇక ఒక చీర కొంటే మరొకటి ఉచితం అని బోర్డు కనిపిస్తే చాలు ఆ దుకాణంలో చీరలు కొనేందుకు మహిళలు ఎగబడతారు. అంతలా చీరెలు వారి జీవితాలతో మమేకమయ్యాయి. అప్పటికప్పుడు కాకపోయినా... తక్కువ ధరకే చీర వస్తుంది కాబట్టి భవిష్యత్తులో కట్టుకునేందుకైనా ఆఫర్ ఉన్న సమయంలోనే ఎక్కువ చీరలు కొని దాచుకుంటారు. ఇలా కొన్ని షాపుల్లో చీరలను పెద్ద సంఖ్యలోనే కొంటారు .
అయితే కర్నాటకలో మాత్రం చీరలు కొనాలంటే ఆధార్ తప్పని సరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటి వరకు బ్యాంకుకు వెళ్లాలంటే ఆధార్ తప్పనిసరి, పేటీఎం, నెట్వర్క్ ప్రొవైడర్లకు, దుకాణాదారులు కూడా ఆధార్ కార్డును అడగటం చూశాం. తాజాగా చీరలు కొనాలంటూ కూడా ఆధార్ తప్పని సరి చేస్తూ కర్నాటక ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ కర్నాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆగష్టు 15న ఆగష్టు 24న శారీ సేల్ నడుపుతోంది. ఇది కేవలం మహిళలకు మాత్రమే ఈ సేల్ నడుపుతోంది. ఇందులో ఖరీదైన మైసూర్ సిల్క్ చీరెలు తక్కువ ధరకే అమ్ముతుండటం విశేషం.
స్వాతంత్ర్యదినోత్సవం రోజును పురస్కరించుకుని రూ.7వేలు చీరను రూ.4వేలకే అమ్మింది. ఇక ఆగష్టు 24న వరలక్ష్మీ వ్రతం కావడంతో రూ.15వేల చీరను రూ.4వేలకే అమ్ముతోంది. అయితే చీరలు కొనేందుకు మహిళలు ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని కర్నాటక రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి మహేష్ తెలిపారు. ఇలా ఎందుకు చేయాల్సి వస్తుందో కూడా మంత్రి వివరించారు.
ఈ చీరెలు కేవలం కట్టుకోవాలని భావిస్తున్న మహిళలకే చెందాలని... ఇక్కడ తక్కువ ధరకు తీసుకెళ్లి ఇతర చోట్ల అసలు ధరకు అమ్ముకునేందుకు వీలు లేకుండా చేసేందుకే ఈ పద్ధతిని ప్రవేశపెట్టినట్లు ఆయన చెప్పారు. అయితే ఆధార్ నెంబర్పై ఒక చీర కొనుగోలు చేస్తే... మరో ఐదేళ్ల వరకు ఇలాంటి మరో చీర కొనుగోలు చేయలేరని మంత్రి స్పష్టం చేశారు. ఈ స్కీమ్లో అవకతవకలు జరగకుండా ఉండేందుకే ఆధార్ను తప్పనిసరి చేశామని మంత్రి వివరించారు. అత్యంత ధర పలికే చీరలు సామాన్య మహిళలకు చేరాలనే మంచి ఉద్దేశంతోనే తమ లాభాలను త్యాగం చేస్తున్నట్లు మంత్రి మహేష్ చెప్పారు.