శుభవార్త: ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జీల తగ్గుదలకు ట్రాయ్ కసరత్తు
మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ మరో తీపికబురును అందించనుంది. ఇంటర్కనెక్ట్ యూసేజ్ ఛార్జీలను తగ్గించేందుకుగాను ట్రాయ్ కసరత్తు చేస్తోంది.
న్యూఢిల్లీ: మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ మరో తీపికబురును అందించనుంది. ఇంటర్కనెక్ట్ యూసేజ్ ఛార్జీలను తగ్గించేందుకుగాను ట్రాయ్ కసరత్తు చేస్తోంది.
వివిధ ఆపరేటర్లు కాల్స్ను కనెక్ట్ చేసేందుకు వసూలు చేస్తున్న ఐసీయూను ప్రస్తుతం నిమిషానికి 14 పైసల నుండి 10 పైసలకు తగ్గించనున్నారు. కాల్ ఛార్జీలు, డేటా ప్యాక్ల ధరలు దిగివస్తున్న క్రమంలో మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ తీపి కబురును అందించేందుకు ప్రయత్నాలను చేస్తోంది.
గత ఏడాది సెప్టెంబర్లో రిలయన్స్ జియో రాకతో మొబైల్ టారిఫ్లు ప్రభావితమైన క్రమంలో ఐసీయూ వసూలు కీలకంగా ముందుకు వచ్చింది. కష్టమర్లకు ఉచిత కాల్స్ అందించే క్రమంలో ఇంటర్కనెక్ట్ యూసేజ్ చార్జీలతో జియోపై పెనుభారం పడింది.
ఈ ఛార్జీలను పూర్తిగా తొలగించాలని రిలయన్స్ డిమాండ్ చేస్తోంది. అయితే ఈ ఛార్జీలను మరింత పెంచాలని ఎయిర్టెల్ డిమాండ్ చేస్తోంది. మొబైల్ పరిశ్రమ ఇంటర్నెట్ ప్రోటోకాల్ మోడల్స్కు మారుతున్నందున ఛార్జీలు అవసరం లేదని రిలయన్స్ అభిప్రాయంతో ఉంది.