కర్తాపూర్ కారిడార్కు శంకుస్థాపన చేసిన పంజాబ్ సీఎం... పాక్ ఆర్మీ ఛీఫ్ పై తీవ్ర విమర్శలు
పాకిస్తాన్ లోని సిక్కుల ఆలయం కర్తాపూర్ సాహిబ్ను సందర్శించాల్సిందిగా పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్కు పాక్ ప్రభుత్వం ఆహ్వానం పలుకగా ఆయన తిరస్కరించిన సంగతి తెలిసిందే. సోమవారం రోజున ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి కర్తాపూర్ కారిడార్కు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో కెప్టెన్ అమరీందర్ మాట్లాడుతూ పాక్ ఆర్మీ ఛీఫ్ కమర్ బాజ్వాపై నిప్పులు చెరిగారు. సరిహద్దుల నిబంధనలను ఉల్లంఘించాలని ప్రపంచంలో ఏ ఆర్మీ అయినా చెబుతుందా అని ప్రశ్నించారు.
కర్తాపూర్కు చేరుకునేందుకు పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో ఉన్న డేరాబాబా నానక్లో శంకుస్థాపన చేశారు. ఇక మరో వైపున అంటే పాక్లో ఈ కార్యక్రమం బుధవారం పాక్ అధికారుల సమక్షంలో జరగనుంది. శంకుస్థాపనకు ముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి అమరీందర్ సింగ్ గురుదాస్పూర్లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతవారం అమృత్సర్ ఆలయంలో ఉగ్రవాదులు దాడి చేసి ముగ్గురుని చంపిన ఘటనపై తీవ్రంగా స్పందించారు.
పఠాన్కోట్, అమృత్సర్లపై దాడి చేయాలంటూ ఉగ్రవాదులును ఏ ఆర్మీ పురామాయిస్తుంది.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాలంటూ ఏ ఆర్మీ చెబుతోందంటూ పాక్ ఆర్మీ ఛీఫ్ కమర్ బాజ్వాను ప్రశ్నించారు కెప్టెన్ అమరీందర్ సింగ్. తాను ఓ ముఖ్యమంత్రిగా కాకుండా ఒక దేశానికి సేవలందించిన సైనికుడిగా ప్రశ్నిస్తున్నట్లు అమరీందర్ తెలిపారు. అంతేకాదు బాజ్వా భారత్ భూభాగంలోకి ప్రవేశించకుండా చూస్తామని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే పాకిస్తాన్లో జరగనున్న వేడుకకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కూడా గైర్హాజరుకానున్నారు. భారత ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు హర్సిమ్రత్ కౌర్ బాదల్, హర్దీప్ సింగ్ పూరీలు హాజరుకానున్నారు. సిద్ధూ కూడా ఈ కార్యక్రమానికి వెళ్లనున్నట్లు చెప్పారు. మతం అందరినీ ఒక్కటి చేస్తుందని సిద్ధూ పేర్కొన్నారు.
మరోవైపు పాక్ ప్రధానిగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న తన మిత్రుడు ఇమ్రాన్ఖాన్ మార్పు తీసుకొస్తారని సిద్ధూ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆగష్టులో ఇమ్రాన్ ఖాన్ ప్రమాణాస్వీకారోత్సవం సందర్భంగా అక్కడి ఆర్మీ ఛీఫ్ను కౌగలించుకోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు సిద్ధూ. అయితే ఆ కౌగలింతే నేడు కర్తాపూర్కు ప్రవేశం అయ్యిందంటూ సిద్ధూ చెప్పుకొచ్చారు.