సచివాలయ ఉద్యోగి సహాయంతో హత్యకు కుట్ర: భయపడి..చెట్టుకు ఉరి వేసుకుని! ఫేస్ బుక్ లైవ్..!
బెంగళూరు: కర్ణాటకలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కొద్దిరోజుల కిందటే పెళ్లి చేసుకున్న నవదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని ముడిగెరె పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తాము ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను ఈ నవ దంపతులు ఫేస్ బుక్ లైవ్ లో వివరించారు. ఉరి వేసుకుంటున్న దృశ్యాలను వీడియోలో చిత్రీకరించుకున్నారు.
ఉప ముఖ్యమంత్రిపై వైఎస్ఆర్ సీపీ తరఫున మహిళా అభ్యర్థి పోటీ?
మృతుల పేర్లు శేషాద్రి, రక్షిత. వారిద్దరూ బెంగళూరులోని గౌరీపాళ్యలో కొన్నాళ్లుగా నివాసం ఉంటున్నారు. వారిది ప్రేమ వివాహం. వేర్వేరు కులాలకు చెందిన వారు కూడా. చదువుకుంటున్న సమయంలో శేషాద్రి, రక్షిత ప్రేమించుకున్నారు. తమ ప్రేమను పెద్దలకు తెలియజేశారు. కులాలు వేరు కావడంతో వారి ప్రేమను పెద్దలు ఆశీర్వదించలేదు. విడదీయడానికి ప్రయత్నించారు. దీనితో కొన్నాళ్ల పాటు వేర్వేరుగా నివసించారు.
మూడు నెలల కిందట వారిద్దరూ కలుసుకుని, ఒక్కటయ్యారు. ఇంట్లో వారికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. జగ్జీవన్ రామ్ నగర పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరీపాళ్యలో నివాసం ఉండసాగారు. ఈ విషయం వారిద్దరి ఇళ్లల్లో తెలిసింది. కటుంబ సభ్యులు భగ్గు మన్నారు. మరోసారి వారిని విడదీయడానికి ప్రయత్నించారు. అప్పటికే పెళ్లి చేసుకోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరు కుటుంబాల వారికి సర్దిచెప్పారు.
అయినప్పటికీ.. శేషాద్రి, రక్షిత తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఊరుకోలేదు. శేషాద్రి, రక్షితలను కడతేర్చాలని నిర్ణయించుకున్నారు. కర్ణాటక సచివాలయంలో పనిచేసే గంగాధర్ అనే వ్యక్తి సహకారంతో వారి హత్యకు కుట్ర పన్నారు. గంగాధర్ నేరుగా శేషాద్రికి ఫోన్ చేసి బెదిరించాడు. తరచూ ఫోన్లు చేస్తుండేవాడు. బెదిరింపులను భరించలేక.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
చిక్ మగళూరు జిల్లా మూడిగెరెకు వెళ్లి, నిర్జన ప్రదేశంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు వారు తమ ఆవేదనను ఫేస్ బుక్ వీడియో ద్వారా తెలియజేశారు. ఒకరినొకరు ప్రేమించుకోవడం, పెద్దలు పెళ్లికి అడ్డుపడటం, గంగాధర్ నుంచి బెదిరింపులు రావడం వంటి ఘటనలను వీడియో ద్వారా వెల్లడించారు. అనంతరం ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే బెంగళూరు జగ్జీవన్ రామ్ నగర పోలీసులు మూడిగెరెకు వెళ్లి దర్యాప్తు చేపట్టారు.