నెట్లో ఏకాంత వీడియోలు లీక్: భార్యాభర్తల ఆత్మహత్య
భోపాల్: తామిద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు రావడంతో ఓ జంట ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. ఆ భార్యాభర్తలు తమ స్మార్ట్ ఫోన్లో తాము సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను చిత్రీకరించుకున్నారు. అవి ఆన్ లైన్లో లీక్ అయ్యాయి.
దీంతో వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాము సన్నిహితంగా ఉన్న దృశ్యాలు ఇంటర్నెట్లో జోరుగా సర్క్యులేట్ కావడంతో.. తమ బంధువులకు, స్నేహితులకు మొహం చూపించలేక వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
కొద్ది రోజుల క్రితం వారు ప్రయాణంలో ఉండగా సన్నిహిత వీడియో తీసుకున్నారు. అయితే, ఆ తర్వాత వారి ఫోన్ ఎక్కడో పోయింది. తమ ఫోన్ పోగానే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు జూన్ 18న సంతోష్, రషీద్, వినోద్, గోవింద్ అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కానీ, ఆలోపే నిందితులు మెమోరీ కార్డు తీసి, అందులోని దృశ్యాలను తమకు తెలిసిన వారికి సోషల్ మీడియా ద్వారా పంపించారు. ఇవి ఇంటర్నెట్లో సర్క్యులేట్ అయ్యాయి. ఈ విషయం తెలిసి వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.