అధికారిపై కూడా కులవివక్ష.. రైతు సంఘం నేతల వేధింపులు... తాళలేక ఆత్మహత్య..(వీడియో)
లక్నో : ఔను.. అధికారులు కూడా కులవివక్షను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఘటన ఒకటి యూపీలో జరిగింది. సాక్షాత్ ఓ ఆఫీసర్ కులవివక్షకు గురవడం ఆందోళన కలిగిస్తోంది. వేధింపులు తాళలేక ఆ అధికారి ఆత్మహత్య కూడా చేసుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైతు సంఘం నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అధికారులు కూడా విధులకు దూరంగా ఉంటామని బెదిరించారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశామని .. మిగిలిన వారిని అదుపులోకి తీసుకుంటామని హామీనిచ్చారు.
కుల వివక్ష ..
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న కుల వివక్ష తగ్గడం లేదు. చదువుకొనే సమయంలో, గ్రామాల్లో, ఆలయ ప్రవేశం సమయంలో కూడా వివక్ష చూపిస్తారు. ప్రతీరోజు ఎక్కడో ఓ చోట కుల వివక్ష ఎదుర్కొంటునే ఉంటారు. తాజాగా యూపీలో ఓ ఘటన జరిగింది. అయితే ఓ అధికారి కులవివక్ష ఎదుర్కొవడం ఆందోళన కలిగిస్తోంది. లఖిమ్పూర్ జిల్లా కుంబీ బ్లాక్ గ్రామంలో త్రివేంద్ర కుమార్ గౌతమ్ గ్రామాభివృద్ధి అధికారి (వీడీవో)గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే అతను దళితుడు కావడంతో వర్ణ వివక్షను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రైతు సంఘం నాయకులు అతనిని కులంపేరుతో దూషించారు. దీంతో అతను ఆత్మన్యూనత భావానికి వచ్చారు.
దూషణలు
ఇటీవల ఓ పబ్లిక్ మీటింగ్లో త్రివేంద్ర కుమార్పై రైతు సంఘం నేత నోరుపారేసుకున్నారు. అతని ఎదుటే తిట్ల దండకాన్ని వినిపించారు. దీంతో గౌతమ్ అవమానానికి గురయ్యాడు. తన ఇంటికెళ్లి ఉరేసుకొన్నాడు. అంతకుముందు రైతు సంఘం నేతల వేధింపులపై సూసైడ్ నోట్ కూడా రాశాడు. రైతు సంఘం నేత, రసూల్ పూర్ గ్రామ పెద్ద .. మరో గ్రామ పెద్ద కుమారుడి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని గౌతమ్ పేర్కొన్నాడు. గౌతమ్ను దూషించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలైంది. అందులో అగ్రకులాలకు చెందిన వారు గౌతమ్ను దూషించారు. తనను కులం పేరుతో దూషిస్తున్నారని .. దీంతో తాను మానసిక క్షోభకు గురయ్యానని గౌతమ్ పేర్కొన్నాడు. తనను వేధించిన రైతు సంఘం నేతలు, వారి కుమారపలై చర్యలు తీసుకోవాలని కూడా రాశారు. దీనిని గౌతమ్ తండ్రి పోలీసులకు చూపించి .. కేసు పెట్టారు. దీంతో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని వారు వివరించారు.
వీరి వల్లే
భారతీయ కిసాన్ యూనియన్ లోక్ తాంత్రిక్కు అనుబంధ సంస్థ కిసాన్ యూనియన్ కూడా గౌతమ్ ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు. గౌతమ్ 8 నెలల క్రితమే విధుల్లో చేరాడని వారు గుర్తుచేసుకున్నారు. ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని మదనపడ్డారు. మరోవైపు గౌతమ్ మృతిపై వీడీవోలు అంతా కలిసి ఆందోళన చేపట్టారు. వికాస్ భవన్ వద్ద రైతు సంఘం నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు నిందితులపై చర్యలు తీసుకునేవరకు గ్రామ్ పంచాయతీ అధికారి సంఘ్ విధులు నిర్వహించబోమని జిల్లా కలెక్టర్కు మెమోరాండం కూడా సమర్పించారు.