యువ టెక్కీ శుభశ్రీ ప్రాణం తీసిన అధికార పార్టీ అక్రమ హోర్డింగ్
చెన్నై: ఇటీవలి కాలంలో బ్యానర్ల(హోర్డింగ్స్) సంస్కృతి బాగా పెరిగిపోయింది. రాజకీయ పార్టీలతోపాటు ఏ కార్యక్రమం జరిగినా జనాలు బ్యానర్లు కట్టడం పరిపాటిగా మారిపోయింది. అయితే, కొన్నిసార్లు తగిన జాగ్రత్త చర్యలు పాటించకుండా కట్టిన బ్యానర్లతో జనాలు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది. తాజాగా, ఇలాంటి ఘటనే తమిళనాడులోని చెన్నైలో చోటు చేసుకుంది.
ప్రాణాలు తీసిన బ్యానర్..
చెన్నైలో వాటర్ ట్యాంకర్ తనపై నుంచి దూసుకెళ్లడంతో ఓ 23ఏళ్ల యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయింది. అధికార పార్టీ అయిన ఏఐఏడీఎంకేకు చెందిన బ్యానర్ ఆమె పడటంతో ఒక్కసారిగా ఆమె కూడా రోడ్డుపై పడింది. అటుగా వేగంగా వస్తున్న వాటర్ ట్యాంకర్ ఆమెపై నుంచి వెళ్లడంతో మృతి చెందింది.
పరీక్ష రాసి వస్తుండగా..
మృతురాలిని సుభశ్రీ(23)గా గుర్తించారు. గురువారంనాడు ఆమె పరీక్ష రాసి ఇంటికి వెళుతున్న సమయంలో దక్షిణ చెన్నైలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులో అధికారంలో ఉన్న ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నెట్రా ఖజగమ్(ఏఐఏడీఎంకే) పార్టీ బ్యానర్ను ఆ పార్టీకి చెందిన ఓ మాజీ కౌన్సిలర్ కట్టాడు.
ఆమెపై నుంచి దూసుకెళ్లిన వాటర్ ట్యాంకర్
అన్నాడీఎంకే బ్యానర్ ఒక్కసారిగా ఆ యువతిపై పడటంతో ఆమె బ్యాలెన్స్ కోల్పోయి రోడ్డుపై పడింది. అయితే, అప్పుడే వేగంగా వస్తున్న వాటర్ ట్యాంకర్ ఆమెపై నుంచి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. యువతి మృతి విషయం తెలిసిన విపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. హోర్డింగ్ పెట్టుకోవడానికి అనుమతి కూడా తీసుకోలేదని ధ్వజమెత్తాయి.
ఇంకెన్ని ప్రాణాలు పోవాలి..
ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే సుభశ్రీ ప్రాణాలు కోల్పోయిందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఆరోపించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దుర్మార్గపు పాలనలో మరెన్ని ప్రాణాలు పోవాలని ప్రశ్నించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.