డాక్టర్లు చనిపోయాడన్నారు.. అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా ఏం జరిగిందంటే..
లక్నో : చేతికంది వచ్చిన కొడుకు కళ్ల ముందే కడతేరిపోయాడు. యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడి ప్రాణాలు వదిలాడు. కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు ప్రారంభించారు. మరికాసేపట్లో సమాధి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో చనిపోయిన వ్యక్తిలో చిన్న కదలిక. పరిశీలించి చూస్తే అతనింకా బతికే ఉన్నాడని అర్థమైంది. హుటాహుటిన హాస్పిటల్కు తరలించగా ప్రస్తుతం వెంటిలేటర్పై ట్రీట్మెంట్ పొందుతున్నాడు. వైద్యుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లో జరిగింది.
హస్టల్ విద్యార్థినిలకు గర్భం....! అసలేం జరిగిందంటే...!
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఫర్ఖాన్
లక్నోకు చెందిన 20 ఏళ్ల మహ్మద్ ఫర్ఖాన్ జూన్ 21న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాల పాలైన అతనిని దగ్గరలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అప్పటి నుంచి ఆ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరుగుతోంది. దాదాపు రూ. 7లక్షలు ఖర్చైనా పరిస్థితిలో మార్పు రాలేదు. దీనికి తోడు ఆస్పత్రి యాజమాన్యం మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో ఫర్ఖాన్ కుటుంబ సభ్యులు చేతులెత్తేశారు. దీంతో సోమవారం డాక్టర్లు అతను మృతి చెందినట్లు ప్రకటించారు.
అంత్య క్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా
హాస్పిటల్లో ఫార్మాలిటీస్ పూర్తైన అనంతరం కుటుంబసభ్యులు ఫర్ఖాన్ మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. అంత్యక్రియల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇంతలో ఫర్ఖాన్ శరీరంలో కదలికలు గుర్తించిన కుటుంబ సభ్యులు పరిశీలించి చూడగా.. అతను ఇంకా బతికే ఉన్నాడన్న విషయాన్ని గుర్తించారు. వెంటనే రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్కు తరలించారు. అతన్ని పరిశీలించిన డాక్టర్లు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు.
చర్యలు తీసుకుంటామని ప్రకటన
ఫర్ఖాన్ పరిస్థితి విషమంగా ఉందన్న డాక్టర్లు ఆయన బ్రెయిన్ డెడ్ మాత్రం కాలేదని లోహియా హాస్పిటల్ డాక్టర్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మనిషి బతికుండగానే చనిపోయాడని చెప్పిన ప్రైవేట్ హాస్పిటల్పై ఫర్ఖాన్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లక్నో చీఫ్ మెడికల్ ఆఫీసర్ నరేంద్ర అగర్వాల్ స్పందించారు. సమగ్ర దర్యాప్తు జరిపి సదరు ప్రైవేట్ హాస్పిటల్పై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.