మోడీ సాయానికి తెగసంబరపడిన జంట: ఇంతకీ ఏం చేశారు?
మీర్జాపూర్: సాధారణంగా పుట్టిన చిన్నారికి కుటుంబసభ్యులో, బంధువులో పేరు పెడతారు. కానీ, ఆ దంపతులు మాత్రం తమకు పుట్టిన చిన్నారికి ఏకంగా ప్రధానే పేరు పెట్టాలని తలచారు. అనుకున్నదే తడవుగా ఈ మేరకు ప్రధానికి లేఖ కూడా రాశారు. వారి ముచ్చటన కాదనలేక, స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ వారికి ఫోన్ చేసి.. ఆ చిన్నారికి ఒక మంచి పేరు పెట్టడం విశేషం.
వివరాల్లోకి వెళితే.. మిర్జాపూర్ జిల్లాకు చెందిన భరత్సింగ్, విభా దంపతులకు గత ఆగస్టు 13న పాప పుట్టింది. అయితే ఎప్పటి నుంచో తమ బిడ్డకు ప్రధాని మోడీ నామకరణం చేయాలని భావించిన భరత్సింగ్ దంపతులు.. చిన్నారి పుట్టిన రోజే ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు. అయితే ఊహించని విధంగా.. సరిగ్గా వారం రోజుల తర్వాత ఆగస్టు 20న భరత్సింగ్కు పీఎంవో నుంచి ఫోన్ కాల్ వచ్చింది.
'ప్రధాని మీతో మాట్లాడాలనుకుంటున్నారు' అని చెప్పడంతో భరత్సింగ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సాక్షాత్తు ప్రధాని ఓ సామాన్యుడికి ఫోన్ చేయడమా? అంటూ ఉబ్బి తబ్బిబయ్యాడు. కొద్ది క్షణాల తర్వాత లైన్లోకి వచ్చిన ప్రధాని మోడీ... భరత్తో మాట్లాడి అభినందనలు తెలిపారు. దాదాపు రెండున్నర నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడిన మోడీ.. పుట్టిన పాపకు ఆ దంపతులిద్దరి పేర్లు కలిసేలా 'వైభవి' అని పేరు పెట్టారు.
కాగా, సాక్షాత్తు ప్రధానే ఫోన్ చేసి తమ కుమార్తెకు పేరు పెట్టడంతో భరత్ దంపతుల ఎంతో సంబరపడిపోయారు. ఈ విషయాన్ని వారు గ్రామస్థులకు చెప్పగా వారు అదంతా కట్టుకథ అని ఎగతాళి చేశారు. దీంతో ఏ నంబర్ నుంచైతే తనకు ఫోన్ కాల్ వచ్చిందో ఆ నంబర్కు మళ్లీ ఫోన్ చేసి.. ప్రధాని పేరు పెట్టిన విషయాన్ని లేఖ ద్వారా అందించాలని కోరారు.
ఈ నేపథ్యంలో స్పందించిన పీఎంవో కార్యాలయం ప్రధాని సంతకం చేసిన లేఖను భరత్కు పంపింది. 'వైభవి కలలను మీరు నిజం చేయండి, ఆమే మీ శక్తి' అంటూ లేఖ ద్వారా మోడీ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
సాక్షాత్తు ప్రధాని తమ కూతురుకు పేరు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని భతర్ సింగ్ తెలిపారు. కాగా, ఇంటర్మీడియట్ చదివిన భరత్ ఆగ్రాలో విధులు నిర్వహిస్తున్నారు. అతని భార్య విభా కామర్స్లో పోస్టు గ్రాడ్యూయేషన్ పూర్తి చేసింది.