సంచలనం: రూ.2కే ఆధార్ డేటా! ఏజెన్సీల కక్కుర్తి! నిజమేనంటున్న సీఐఏ మాజీ ఉద్యోగి..
న్యూఢిల్లీ: ఆధార్ డేటా భద్రత మళ్లీ చర్చనీయాంశంగా మారింది. రూ.500 ఇస్తే చాలు.. ఆన్లైన్లో యూజర్ల పేర్లు, చిరునామాలు, పిన్ నంబర్లు, ఫొటోలు, ఫోన్ నంబర్లు, ఈమెయిళ్లు సులువుగా లభిస్తున్నాయి. ఆధార్ డేటా చోరీ విషయాన్ని గురువారమే ట్రిబ్యూన్ రిపోర్టు తేటతెల్లం చేసిన సంగతి తెలిసిందే.
ఆ తరువాత రెండ్రోజులకే మరో సంచలన ఇన్వెస్టిగేటివ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. కేవలం ఆన్లైన్లో మాత్రమే కాదని, ఆధార్ ఎన్రోల్మెంట్ ఏజెన్సీల ద్వారా కూడా ఆధార్ డేటా చోరీ జరుగుతోందని, రూ.2 నుంచి రూ.5 మధ్య ఆధార్ యూజర్ల వివరాలు యధేచ్ఛగా లభిస్తున్నాయని 'ఇండియా టుడే' వెల్లడించింది.
రూ.30 వేలకే 15 వేలమంది డేటా...
ఫరీదాబాద్లో ఉన్న అలంకిత్ అసైన్మెంట్స్ లిమిటెడ్ అనే ఎన్రోల్మెంట్ ఏజెన్సీ ఆధార్ డేటాను విక్రయిస్తుంన్నట్లు సమాచాం. ‘15 వేల అప్లికెంట్ల ఆధార్ డేటాను రూ.30 వేలకు ఇస్తాం..' అని అలంకిత్ బ్రాంచ్ హెడ్ బ్రేజన్ సింగ్ చెప్పినట్లు ‘ఇండియా టుడే' ఇన్వెస్టిగేటివ్ రిపోర్టు పేర్కొంది.
రూ.2కే అన్ని ‘ఆధారా'లు...
కేవలం రూ.2కే అప్లికెంట్ల పేరు, చిరునామా, పుట్టిన తేది, మొబైల్ నెంబర్లు, ఈ-మెయిల్ను ఇచ్చేందుకు అతను సిద్దమయ్యాడని కూడా పేర్కొంది. తమ వద్ద 50 వేల అప్లికెంట్ల రికార్డులున్నాయని, ఆ డేటా అంతా నోట్ చేసుకోవచ్చని బ్రేజన్ సింగ్ పేర్కొన్నట్టు ‘ఇండియా టుడే' ఇన్వెస్టిగేటివ్ రిపోర్టు తెలిపింది.
ఆధార్పై యూఏడీఏఐ గొప్పలు...
ఇలాంటి సంచలన నివేదికలు వెలుగులోకి వస్తుండడంతో ఆధార్ భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆధార్ డేటాకు కేవలం ఆన్లైన్లోనే కాక ఆఫ్లైన్లో కూడా భద్రత కరువైందని ఈ రిపోర్టుల ద్వారా వెల్లడవుతూనే ఉంది. ఇంత జరుగుతున్నా యూఏడీఏఐ మాత్రం ఆధార్పై ఇంకా గొప్పలు చెప్పుకుంటోంది. ఆధార్ డేటా హ్యాక్ అయ్యే అవకాశమే లేదని, ఎక్కడా ఆధార్ డేటా చోరీకి గురికాలేదని పేర్కొంటోంది.
సీఐఏ మాజీ ఉద్యోగి ఏమంటున్నారంటే...
‘ఆధార్' సమాచార భద్రతపై కేంద్ర ప్రభుత్వం, యూఐడీఏఐ చెబుతోన్న మాటలు నిజం కాదన్న వాదనకు బలం చేకూరుతోంది. ఆధార్ సమాచారానికి భద్రతలేదని, దాన్ని ఎవరైనా చోరీ (హ్యాక్) చేయగలరని అమెరికా కంప్యూటర్ ప్రొఫెషనల్, సీఐఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ తాజాగా ట్విట్టర్లో అభిప్రాయపడ్డారు. 'ట్రిబ్యూన్' మ్యాగజైన్ కథనాన్ని ఉద్దేశిస్తూ, స్నోడెన్ ‘ఆధార్'పై ట్విట్టర్లో తాజాగా సందేశం పోస్ట్ చేశారు. సంబంధిత వర్గాలకు డబ్బులు ఇస్తే చాలు... సమాచారం బయటకు వస్తుందని, అదేమంత పెద్ద కష్టమైన పనేమీ కాదని స్నోడెన్ వ్యాఖ్యానించారు.
ఆధార్పై ఆందోళన పట్టించుకోని కేంద్రం...
ప్రజల వ్యక్తిగత సమాచారం చాలా భద్రంగా ఉందని ప్రభుత్వాలు నమ్మబలుకుతాయి, కానీ అది నిజం కాదన్న సీఐఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ వ్యాఖ్యలు ఆలోచించదగినవే. సామాన్యుడి దగ్గర నుంచీ... సుప్రీంకోర్టు వరకూ ‘ఆధార్' అమలు చట్టబద్ధంగా లేదని, పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరమని చెప్పినా బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కారు మాత్రం ఎవరి మాటలనూ వినిపించుకునే పరిస్థితి కనపడటం లేదు. ఈ నేపథ్యంలో ‘ఆధార్' సమాచార భద్రతపై అనేక వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది.