ఆర్బీఐ షాక్: ఇక మీ పేటీఎం, మొబిక్విక్ పనిచేయకపోవచ్చు?..
బెంగళూరు: పేటీఎం, మొబిక్విక్ ద్వారా లావాదేవీలు జరిపేవారికి ఇదో చేదు వార్త. ఇకనుంచి మీ మొబైల్ వాలెట్లోకి ఫండ్స్ యాడ్ చేసుకోవడం కుదరకపోవచ్చు. కేవైసీ(నో యువర్ కస్టమర్) నిబంధన గడువు ముగియడంతో.. దానికి సంబంధించి పూర్తి వివరాలు అందించినవారికి మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
దేశవ్యాప్తంగా సామాన్యులంతా డిజిటల్ పేమెంట్స్కు అలవాటు పడుతున్న తరుణంలో ఇదో పెద్ద దెబ్బ అనే చెప్పాలి. కాగా, ఫిబ్రవరి 28 వరకు వాలెట్ యూజర్ల నుంచి కేవైసీ వివరాలను పొందాలని డిజిటల్ వాలెట్ కంపెనీలకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశించింది.
ఈ గడువును ఎక్కువమంది యూజర్స్ ఉపయోగించుకోకపోవడంతో మరోసారి గడువు పొడగించాలని డిజిటల్ వాలెట్ కంపెనీలు ఆర్బీఐని కోరాయి. కానీ ఆర్బీఐ మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో కేవైసీ వివరాలు సమర్పించిన యూజర్స్ మార్చి 1నుంచి ఆ సేవలను కోల్పోతున్నారు.
పూర్తి వివరాలు వెల్లడించని కస్టమర్లకు రూ.10వేల మేర ట్రాన్సాక్షన్స్కు అవకాశం ఇవ్వాలని డిజిటల్ వాలెట్ సంస్థలు ఆర్బీఐని కోరుతున్నాయి. కానీ ఆర్బీఐ మాత్రం పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ కేవైసీ నిబంధనలు తప్పనిసరి అని చెబుతోంది. ఇదే నిబంధనను బ్యాంకింగ్ఎకో సిస్టమ్కు కూడా విస్తరించనున్నట్టు ఆర్బీఐ పేర్కొనడం గమనార్హం.
కాగా, ఆర్బీఐ నిబంధనల కారణంగా డిజిటల్ వాలెట్ యూజర్లపై తీవ్ర ప్రభావం పడుతుందని ది మొబైల్ వాలెట్ ఫౌండర్ వినయ్ కలాంత్రి అన్నారు. అయితే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఉండవచ్చునని చెప్పారు.
కేవైసీ నిబంధనలను పాటించని కస్టమర్లకు ఇక నుంచి ఫండ్స్ ట్రాన్సాక్షన్, ఫండ్స్ యాడ్ చేసుకునేవెసులుబాటు ఉండదు. అప్పటికే ఉన్న డబ్బును మాత్రం కొనుగోళ్లకు వెచ్చించవచ్చు.
వాలెట్ నగదును కోల్పోకుండా.. వాటిని బ్యాంకులకు ట్రాన్సఫర్ చేసుకునేలా కూడా ఆర్బీఐ వీలు కల్పించిన విషయం తెలిసిందే. ఇకపోతే డిజిటల్ వాలెట్ యూజర్లలో 90 శాతం కస్టమర్లు ఇప్పటి వరకు కేవైసీ వివరాలను వాలెట్ ప్రొవైడర్లకు సమర్పించలేదు. దీంతో వాలెట్ ప్రొవైడర్లపై తీవ్ర ప్రభావం తప్పదంటున్నారు.