పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త!
ఇకమీదట ఉద్యోగులు ఉద్యోగాలు మారినప్పుడల్లా పిఎఫ్ ఖాతా కూడా ఆటోమేటిక్ గా బదిలీ అవుతుందని చీఫ్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వి పి జాయ్ వెల్లడించారు. ఇది వచ్చే నెల నుంచి అమలులోకి రానుంది.
న్యూఢిల్లీ: పీఎఫ్ ఖాతాదారులకు ఓ శుభవార్త. ఇకమీదట ఉద్యోగులు ఉద్యోగాలు మారినప్పుడల్లా పిఎఫ్ ఖాతా కూడా ఆటోమేటిక్ గా బదిలీ అవుతుందని చీఫ్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వి పి జాయ్ వెల్లడించారు. ఇది వచ్చే నెల నుంచి అమలులోకి రానుంది.
ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) లో మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జాయ్ పేర్కొన్నారు. ఉద్యోగాలు మారినప్పుడు, ఎన్నో పీఎఫ్ ఖాతాలను మూసివేస్తున్నారని ఇకముందు అలా జరగకుండా కొత్త సంస్థ పేరిట బదిలీ చేసేలా చర్యలు చేపట్టామన్నారు.
''పీఎఫ్ ఖాతా అనేది శాశ్వతం. ఈ ఖాతాలకు ఇప్పుడు ఆధార్ నంబరును నమోదు చేశాం, పీఎఫ్ ఖాతాలను మూసివేయకుండా వారి సామాజిక భద్రత కోసం ఒకే ఖాతాను కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం''అని జాయ్ చెప్పారు.
ఎవరైనా ఉద్యోగాలు మారినపుడు వారి నుంచి దరఖాస్తులు రాకుండానే మూడు రోజుల్లో వారి ధనాన్ని బదిలీ చేస్తామని జాయ్ వివరించారు. ఉద్యోగి ఎక్కడ పనిచేస్తున్నా ఆధార్ ఐడీని ధ్రువీకరిస్తే వెంటనే వారి ఖాతాలను దరఖాస్తు లేకుండానే బదిలీ చేస్తామని చెప్పారు.
ఈపీఎఫ్ఓ కవరేజ్ విస్తరించడానికి ప్రయత్నాలు కూడా చేపట్టామని ఆయన వివరించారు. పీఎఫ్ డబ్బును ఇల్లు, పిల్లల విద్య లేదా ఆసుపత్రి అవసరాల కోసం మాత్రమే ఉపసంహరించుకోవాలని జాయ్ కోరారు.