మీ వేలిముద్రే మీ బ్యాంక్: డిజిధన్ మేళాలో ప్రధాని నరేంద్ర మోడీ
ఒకప్పుడు వేలిముద్ర వేసేవారిని చులకనగా చూసేవారని, కానీ ఇప్పుడు ఆ వేలిముద్రే మీ బ్యాంకు, మీ గుర్తింపు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
న్యూఢిల్లీ: ఒకప్పుడు వేలిముద్ర వేసేవారిని చులకనగా చూసేవారని, కానీ ఇప్పుడు ఆ వేలిముద్రే మీ బ్యాంకు, మీ గుర్తింపు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో జరిగిన డిజిధన్ మేళాలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
లక్కీ గ్రాహాక్ యోజన, డిజిధన్ వ్యాపార యోజన పథకాలను క్రిస్మస్ కానుకగా దేశానికి అందిస్తున్నామన్నారు. రూ.50 నుంచి రూ.3 వేల విలువ లోపు ఈ-లావాదేవీలు నిర్వహించేవారికి బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రధాని చెప్పారు.
ఈ-లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఇవాళ భీమ్ యాప్ ను ఆవిష్కరించిన ఆయన రాజ్యాంగ నిర్మాణంలో భాగాస్వామ్యమైన అంబేద్కర్ గొప్ప ఆర్థికవేత్త అని, అందుకే భీమ్ రావ్ అంబేద్కర్ పేరిట 'భీమ్' యాప్ ను రూపొందించామని చెప్పారు. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం అయిన ఏప్రిల్ 14న మెగా డ్రా నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.
భీమ్ యాప్ చదువుకున్న వాళ్లకు కాదని, నిరక్షరాస్యులు అయిన రైతులు, ఆదివాసీలు, నిరుపేదలకు ఇది అమితంగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ యాప్ భద్రతకు సంబంధించి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు, ఈ యాప్ కు సంబంధించి మరికొన్ని వారాల్లో ఒక కీలక ప్రకటన వెలువరించనున్నట్లు ప్రధాని వెల్లడించారు.
ఈ సందర్భంగా డిజి ధన్ పథకం ద్వారా లావాదేవీలు నిర్వహించిన వారికి మోడీ బహుమతులు అందజేశారు. డిజి ధన్ లక్కీ డ్రా కింద విజేతలుగా నిలిచిన వారికి చెక్ లు అందజేశారు. దాదాపు 100 రోజులపాటు సుమారు 15 వేల మంది కస్టమర్లకు ఈ లక్కీ డ్రా వర్తించనుంది.
కేవలం యూపీఐ, యూఎస్ఎస్ డీ, ఏఈపీఎస్, రూపే కార్డులు వినియోగించే వారు మాత్రమే ఈ లక్కీ డ్రాకు అర్హులు. ఈ భీమ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని అనుకునే వారు గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి ' భీమ్ నేషనల్ పేమెంట్స్' అని టైప్ చేస్తే యాప్ కనిపిస్తుంది.