సీఏఏపై యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు: పౌరసత్వంపై నరేంద్ర మోడీ క్లారిటీ
కోల్కతా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశంలోని యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ చట్టం వల్ల ఎవరి పౌరసత్వ తొలగించబడదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. భారతదేశం, దాని రాజ్యాంగంపై నమ్మకం ఉన్నవారంతా భారతీయ పౌరులేనని వ్యాఖ్యానించారు.
పౌరసత్వం తొలగించడం కాదు.. ఇస్తున్నాం..
‘నేను మరోసారి చెబుతున్నా.. పౌరసత్వ సవరణ చట్టం అనేది దేశంలోని ఎవరి పౌరసత్వాన్ని తొలగించడం జరగదు. ఇది పౌరసత్వం ఇస్తుంది. పాకిస్థాన్లో మతపరమైన హింసను ఎదుర్కొని మనదేశానికి వచ్చినవారికి పౌరసత్వం ఇవ్వాలని స్వాతంత్ర్యం అనంతరం మహాత్మాగాంధీ లాంటి నేతలు చెప్పారు' అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు..
కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై యువతకు ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయని.. అయితే, కొందరు అపోహలు సృష్టించి యువతను తప్పుదోవ పట్టిస్తోందని ప్రధాని మండిపడ్డారు. యువతలో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయడం తమ బాధ్యత అని ఆయన అన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే అసత్య ప్రచారం..
పౌరసత్వ సవరణ చట్టంపై యువత, ప్రజలను రాజకీయ లబ్ధి కోసం కొన్ని పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇది ప్రజలంతా అర్థం చేసుకోవాలని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టంపై కొన్ని రాజకీయ పార్టీలు దురుద్దేశంతో అసత్యాలను, అపోహలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సీఏఏకు మద్దతు పలుకుతున్న యువత, ప్రజలను ఆయన ప్రశంసించారు.
మార్పు కోసం ప్రయత్నించాలి..
హౌరాలోని బేలూరు మఠ్లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. తాను గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు స్వామి ఆత్మానంద జీ ఆశీర్వదాలు తీసుకున్నానని చెప్పారు. ఆయన ఈరోజు మన మధ్య భౌతికంగా లేరని అన్నారు. అయితే, ఆయన చేసిన పని, ఆయన చూపిన మార్గం మనకు రామకృష్ణ మిషన్లా ఎప్పుడూ దిశనిర్దేశం చేస్తాయన్నారు. స్వామి వివేకానంద జీ చెప్పిన మాటలు తనకు ఎప్పుడూ గుర్తుంటాయని అన్నారు. తనకు 100 మంది ఎనర్జిటిక్ యూత్ ఇస్తే.. తాను దేశాన్ని మార్చేస్తానంటూ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. మార్పు కోసం మన శక్తి సామర్థ్యాలు ఉపయోగించాలని అన్నారు. రెండ్రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం బేలూరులోని రామకృష్ణ మఠ్ సందర్శించారు.