ఆఖరిసారి చూడాలని: ప్రేయసితో వీడియో కాల్ మాట్లాడుతూనే కాల్చుకున్నాడు
పాట్నా: బీహార్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు(19) తన ప్రేయసితో వీడియో కాల్ మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
బేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిచక్ ప్రాంతానికి చెందిన ఆకాశ్ కుమార్ అనే యువకుడు గత సంవత్సరం ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. కాగా, తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమిస్తున్నాడు ఆకాశ్. అయితే, అతని ఇంట్లో వారు మాత్రం అతని ప్రేమను అంగీకరించలేదు.
మాట్లాడుతూనే కాల్చేసుకున్నాడు..
ఈ క్రమంలో కొంతకాలంగా డిప్రెషన్తో బాధపడుతున్న ఆకాశ్ సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన ప్రేయసికి ఫోన్ చేశాడు. ఆమెతో వీడియో కాల్ మాట్లాడుతుండగానే తుపాకీతో కాల్చేసుకున్నాడు. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు.
ఆకాశ్ తండ్రి బలవంతం వల్లే
సమాచారం అందుకున్న పోలీసులు ఆకాశ్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతని గదిలో పడి ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం బాలికను స్టేషన్కు తరలించారు. వేరే అమ్మాయిని త్వరగా పెళ్లిచేసుకోమని ఆకాశ్ని తన తండ్రి సంజయ్ కుమార్ బలవంతం చేస్తున్నాడని బాలిక పోలీసులకు తెలిపింది. తన తండ్రికి నేర చరిత ఉండటంతో ఆకాశ్ తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకోలేదని పేర్కొంది.
ఆఖరిసారి చూడాలని
ఆఖరిసారిగా చూడాలని ఉందంటూ ఆకాశ్ నాకు తెల్లవారుజామున వీడియో కాల్ చేశాడు. అప్పటికే అతని చేతిలో తుపాకీ ఉంది. వద్దని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. కొద్దిసేపటికి కాల్ కట్ అయ్యింది. ఆ తరువాత ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఆకాశ్ స్పందించలేదు' అని అమ్మాయి తెలిపింది.
ఫలితం లేకపోయింది..
ఆ తర్వాత వెంటనే అతని(ఆకాశ్) సోదరుడు చందన్కు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాను. కానీ చందన్ వెళ్లి చూసేసరికే ఆకాశ్ రక్తపుమడుగుల్లో పడి ఉన్నాడు.' అని బాలిక విచారణలో తెలిపింది. ఇదిలా ఉండగా..తన కుమారుడికి ఎవరో కావాలనే హత్య చేశారంటూ ఆకాశ్ తండ్రి సంజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.