అధికారుల తీరుపై ఎమ్మెల్యే నిరసన.. ఆమె కూర్చున్న చోటును శుద్ధి చేసిన కాంగ్రెస్ యూత్ వింగ్.. ఆ తర్వాత
తిరువనంతపురం : కేరళలో కాంగ్రెస్ యూత్ వర్కర్లు ప్రదర్శించిన అత్యుత్సాహం కొంపముంచింది. ఓ మహిళా ఎమ్మెల్యేను నిరసన చేపట్టిన ప్రాంతాన్ని శుద్ధి చేయడం వివాదాస్పదమైంది. సదరు ఎమ్మెల్యే దళితురాలు కావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ యూత్ కార్యకర్తల తీరుపై రాష్ట్ర మంత్రులు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు.
నిరనస తెలిపిన ఎమ్మెల్యే
నియోజకవర్గం పర్యటనలో భాగంగా త్రిసూర్కు సమీపంలోని చెర్పూకు చేరుకున్న నట్టిక ఎమ్మెల్యే గీతా గోపి అక్కడి రోడ్ల దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మత్తులుచేయడం లేదంటూ స్థానిక పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ ఆఫీసు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. అధికారులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాసేపు ధర్నా నిర్వహించిన అనంతరం గీతా గోపి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే కూర్చున్న చోట శుద్ధి చేసిన కాంగ్రెస్
సీపీఐ ఎమ్మెల్యే గీతా గోపి చేసిన ఆందోళనకు కౌంటర్గా కాంగ్రెస్ యూత్ వింగ్ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించింది. గీతా గోపి తన చర్యలతో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించింది. అంతటితో ఆగకుండా ఆమె కూర్చున్న స్థలాన్ని ఆవు పేడ కలిపిన నీళ్లతో శుద్ధి చేసింది. ఇది కాస్తా వివాదాస్పదమైంది. గీతా గోపి దళితురాలు కావడం వల్లే కాంగ్రెస్ కార్యకర్తలు శుద్ధి కార్యక్రమం నిర్వహించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై సదరు ఎమ్మెల్యే పోలీసులకు కంప్లైంట్ చేయడంతో వారు కేసు నమోదుచేశారు.
కాంగ్రెస్ చర్యను తప్పుబట్టిన మంత్రులు
నిరసనలో భాగంగా కాంగ్రెస్ యూత్ వింగ్ చేసిన పనిపై రాష్ట్ర మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే కూర్చున్న చోట శుద్ధి కార్యక్రమం నిర్వహించడంపై కేరళ కల్చరల్ మినిస్టర్ ఏకే బాలన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి పనులు సమర్థనీయం కాదని అన్నారు. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి శ్యామల సైతం కాంగ్రెస్ కార్యకర్తల చర్యను తప్పుబట్టారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యంకాదని అభిప్రాయపడ్డారు.