ప్రియురాలి కడసారి చూపుకోసం వెళితే కొట్టి చంపారు
చెన్నై: తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుడియాత్తం ప్రాంతంలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా.. ఆమె మృతదేహాన్ని చూసేందుకు వెళ్లిన ఆమె ప్రియుడ్ని బంధువులు దారుణంగా కొట్టి చంపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. గుడియాత్తం సమీపంలోని తట్ట పారైకి చెందిన గోపాల్ కుమార్తె సంఘవి(18) ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కాగా, ఆమె అదే ప్రాంతానికి చెందిన మేఘనాధన్ కుమారుడు ఆనందన్(24) ప్రేమలో పడింది. వీరి ప్రేమ విషయం తెలిసి ఇద్దరి కుటుంబాల పెద్దలు మందలించడంతో వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
కాగా, డిసెంబర్ 18వ తేదీ రాత్రి సంఘవి గ్రామ సమీపంలోని బావిలోపడి ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె కనిపిచకపోవడంతో కుటుంబసభ్యులు పలు చోట్ల గాలించారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అయితే శనివారం సాయంత్రం బావిలో ఆమె మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు.
పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టంకు తరలించారు. పోస్టు మార్టం అనంతరం ఆదివారం ఉదయం భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించారు. కాగా, ప్రియురాలిని కడసారి చూసుకునేందుకు వచ్చిన ఆనందన్పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘవి బంధువులు.. ఆమె ఆత్మహత్యకు అతనే కారణమంటూ తీవ్రంగా కొట్టారు.
వారి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆనందన్ను గ్రామస్తులు గుడియాత్తం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్రంగా గాయపడిన ఆనందన్ చికిత్స పొందుతూ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతురాలి సోదరుడు ఉదయ కుమార్, రాజ్కుమార్, కార్తికేయన్, పిచ్చాండి, సతీష్ కుమార్లను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.