తుపాకులు పట్టుకోవడం తప్ప యువతకు మరో మార్గం లేదు: మెహబూబా ముఫ్తీ వివాదాస్పదం
శ్రీనగర్: పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ అధినేత్రి, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కాశ్మీర్ వ్యాలీలోని యువతకు తుపాకులు పట్టుకోవడం తప్ప మరే అవకాశం లేదని ఆమె వ్యాఖ్యానించారు.
రాష్ట్రపతి పాలనలోకి వెళ్లిన సమయంలోనే తొలిసారి జమ్మూకాశ్మీర్లో మిలిటెంట్లు పుట్టుకొచ్చారని, ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దుతో మరోసారి మిలిటెంట్లు పెరిగిపోయారని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు చేశారు.
అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమిపాలయ్యారని.. ఇక బీజేపీనే మిగిలి ఉందని మెహబూబా ముఫ్తీ అన్నారు. బీహార్ రాష్ట్రంలో ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ నేతృత్వంలోని మహాకూటమి విజయం సాధిస్తుందన్నారు. అంతేగాక, ఎగ్జిట్ పోల్స్ మహాకూటమికి పట్టం కట్టడంతో తేజశ్వి యాదవ్కు మెహబూబా ముఫ్తీ అభినందనలు తెలిపారు.
ఎన్నికల్లో తేజశ్వి యాదవ్ సరైన మార్గంలో నడిచారని వ్యాఖ్యానించారు. దేశంలోని అందరు పౌరులు జమ్మూకాశ్మీర్లో స్థిరపడేందుకు, భూములు కొనుగోలు చేసేందుకు కేంద్రం అనుమతివ్వడంపై ముఫ్తీ మండిపడ్డారు. తమ వనరులను అమ్మేస్తున్నారని ఆరోపించారు. పండిట్ల గురించి ఏంటని ప్రశ్నించారు. బీజేపీ వారికి హామీలిచ్చిందన్నారు. బయటివారిని రప్పించి ఇక్కడి భూములను అమ్మేస్తున్నారని విమర్శించారు.
ఇక్కడి యువతకు ఉపాధి లేదని, వారికి తుపాకులు పట్టుకోవడం తప్ప వేరే అవకాశం లేదని మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, ఉగ్రవాద రిక్రూట్ మెంట్లు పెరిగాయని చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాలవారికి ఇక్కడ ఉద్యోగాలిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వాజపేయి సిద్ధాంతాన్ని పాటించాల్సి ఉందని చెప్పుకొచ్చారు.