మళ్లీ నిఫా కలకలం.. కేరళలో మహమ్మారి ఆనవాళ్లు..?
ఎర్నాకుళం : కేరళలో మరోసారి నిఫా కలకలం సృష్టించింది. గతేడాది 17 మందిని బలిగొన్న ఈ మహమ్మారి ఆనవాళ్లు మళ్లీ కనిపించడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఎర్నాకుళంలో ఓ యువకుడికి నిఫా సోకిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఆందోళన సృష్టించాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం వ్యాధి లక్షణాలు కనిపించిన మాట వాస్తవమేనని అయితే అదింకా నిర్థారణ కాలేదని ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది.
ఎర్నాకుళం యువకుడిలో నిఫా లక్షణాలు
ఎర్నాకుళంకు చెందిన 23 ఏళ్ల యువకుడు నిఫా లక్షణాలతో హాస్పిటల్లో చేరాడు. ఇడుక్కిలో చదువుకుంటున్న ఆ యువకుడు పది రోజులుగా జ్వరం, ఇతరత్రా లక్షణాలతో బాధపడుతున్నాడు. ఇంటర్న్షిప్ ప్రోగ్రాం కోసం మే 21న మరో 22 మందితో కలసి త్రిసూర్లోని ఓ కంపెనీకి వెళ్లాడు. అప్పటికే జ్వరంతో బాధపడుతున్నా ఆ యువకుడు రెండు రోజుల తర్వాత ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అయినా ఫీవర్ తగ్గకపోవడంతో ఎర్నాకుళం తిరిగి వచ్చాడు. తల్లిదండ్రులు ఆ యువకున్ని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లడంతో పరీక్షించిన డాక్టర్లు నిఫా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. నిర్థారణ కోసం బ్లడ్, యూరిన్ శాంపిళ్లను పూనేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు.
సోషల్ మీడియాలో ప్రచారం
ఎర్నాకుళం యువకుడికి నిఫా సోకిందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ప్రాణాంతక వైరస్ మళ్లీ వచ్చిందంటూ పలువురు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కేరళ సర్కారు స్పందించింది. ఎర్నాకుళానికి చెందిన యువకుడిలో వ్యాధి లక్షణాలు కనిపించిన సంగతి నిజమేనని అయితే అది ఇంకా నిర్థారణ కాలేదని, ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ స్పష్టం చేశారు. అయితే నిఫా వైరస్ వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పలు హాస్పిటళ్లలో ఐసోలేటెడ్ వార్డులు ఏర్పాటు చేశారు. నిఫా వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే ప్రజలు హాస్పిటల్కు వెళ్లి నిర్థారణ చేసుకోవాలని శైలజ కోరారు.
త్రిసూర్ వచ్చే నాటికే జ్వరం
ఇదిలా ఉంటే నిఫా లక్షణాలు కనిపిస్తున్న యువకుడు మే 21న త్రిసూర్ వచ్చాడని, అప్పటికే అతను జ్వరంతో బాధపడుతున్నాడని జిల్లా వైద్యాధికారి రీనా ప్రకటించారు. రెండు రోజుల తర్వాత ఓ ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్నాడని జ్వరం తగ్గకపోవడంతో స్వస్థలానికి తిరిగి వెళ్లాడని చెప్పారు. ప్రస్తుతం అతని తలలో మాత్రమే ఇన్ఫెక్షన్ ఉందని, ఇంకా శ్వాస కోశ వ్యవస్థ వరకు వైరస్ చేరలేదని డాక్టర్ స్పష్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా త్రిసూర్ మెడికల్ కాలేజీలో కూడా ఐసోలేషన్ వార్డు ఏర్పాటుచేసినట్లు ప్రకటించారు.
17మందిని బలిగొన్న నిఫా
2018 మే నెలలో నిఫా వైరస్ కేరళను వణికించింది. అప్పట్లో ఈ మహమ్మారి బారిన పడి 17మంది ప్రాణాలు కోల్పోయారు. కోజికోడ్లో తొలుత ఒకే కుటుంబానికి ముగ్గురు వ్యక్తుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. నిఫా పేషంట్లకు సేవలందిస్తూ 31 ఏళ్ల లినీ అనే నర్సు మృత్యువాత పడింది. గబ్బిలాల కారణంగా వ్యాపించే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటైన నిఫా వైరస్ సోకితే వ్యక్తులు బతికే చాన్స్ కేవలం 5శాతం మాత్రమే ఉంది.