పట్టపగలే యువకుడి హత్య.. కారణమేంటంటే..?
ఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన చిన్న వివాదం చినికి చినికి గాలివానగా మారడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేసినందుకు ఓ యువకున్ని మరొకరు కత్తితో పొడిచి చంపాడు. శనివారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీలోని తిలక్ నగర్కు చెందిన అంకిత్ అనే యువకుడు మొబైల్ రిపేర్ చేయించుకునేందుకు స్థానిక మార్కెట్కు వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తుండగా ఖాళీ ప్రదేశంలో మూత్ర విసర్జన చేశాడు. దీన్ని గమనించిన రవి అనే యువకుడు అంకిత్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బహిరంగ ప్రదేశంలో మూత్రవిసర్జన చేయడమేంటని ప్రశ్నించాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య మాటమాట పెరిగింది. అది కాస్తా గొడవకు దారి తీసింది.
అంకిత్తో గొడవ జరుగుతున్న ప్రాంతానికి కొద్ది దూరంలోనే రవి ఇల్లు ఉంది. దీంతో విషయం తెలుసుకున్న అతని స్నేహితులు అక్కడికి చేరుకుని అంకిత్పై దాడి చేశారు. తీవ్ర ఆగ్రహానికి లోనైన రవి, అంకిత్ను కత్తితో పొడిచాడు. దాడిలో తీవ్ర గాయాలపాలైన అతను ఘటనాస్థలంలో కుప్పకూలాడు. అతని కుటుంబసభ్యులు వచ్చి హాస్పిటల్కు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. అంకిత్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడు రవిని అదుపులోకి తీసుకున్నారు. హత్యలో రవి స్నేహితుల ప్రమేయంపైనా ఆరా తీస్తున్నారు.