అమ్మను చంపిన మేన మామను లేపేశాడు
గుర్ గావ్: ఆస్తి కోసం గొడవపడి తన తల్లిని దారుణంగా కాల్చి చంపిన మేనమామ మీద ఓ యువకుడు పగ తీర్చుకున్నాడు. తన తల్లిని ఏ విధంగా హత్య చేశారో అదే విధంగా అతని మేనమామను దారుణంగా కాల్చి చంపేశాడు.
ఢిల్లీ శివార్లలోని గుర్ గావ్ లో లలిత్ అలిమాస్ జానీ (19) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతని మేన మామ సందీప్ కటారియా (35). 10 సంవత్సరాల క్రితం లలిత్ తల్లిని రివాల్వర్ తో కాల్చి చంపేశారు. అప్పుడు లలిత్ వయస్సు 8 సంవత్సరాలు.
ఆ వయస్సులో లలిత్ ఏమి చెయ్యలేకపోయాడు. ఆస్తి కోసం తన తల్లిని మేనమామ సందీప్ కటారియా హత్య చేశాడని లలిత్ కు తెలుసు. తరువాత లలిత్ కు ఆస్తిలో భాగం ఇవ్వకుండా సందీప్ ఆధీనంలోనే పెట్టుకున్నాడు.
సందీప్ కు గుర్ గావ్ సెక్టార్ 9 లో రాధ కృష్ణ గో సంరక్షణా కేంద్రం ఉంది. అక్కడే లలిత్ పని చేస్తున్నాడు. 2013-14 మధ్య కాలంలో లలిత్ తన మేన మామ సందీప్ మీద రెండు సార్లు హత్యాయత్నం చేశాడు. అయితే సందీప్ కు తన మేనల్లుడు లలిత్ మీద అనుమానం రాలేదు.
లలిత్ తన స్నేహితులతో కలిసి మేన మామ హత్యకు గట్టిగా ప్లాన్ వేశాడు. సందీప్ గో సంరక్షణ కేంద్రంలో ఉన్నాడు. ఇద్దరు గేట్ దగ్గర వేచి ఉన్నారు. మరో ఇద్దరితో కలిసి లోపలికి వెళ్లిన లలిత్ రివాల్వర్ తో కాల్పలు జరిపి మేనమామ సందీప్ ను అంతం చేశాడు.
అమ్మను చంపాడని పగ పెంచుకున్న లలిత్ తన స్నేహితులతో కలిసి సందీప్ ను హత్య చేశాడని పోలీసులు అన్నారు. అంతే కాకుండ తనకు ఆస్తి పంచి పెట్టకుండా అందులోనే గో సంరక్షణ కేంద్రం పెట్టుకుని తనకు తక్కువ జీతం ఇస్తున్నాడని లలిత్ పగ పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు.
నిందితులు అందరూ 20 సంవత్సరాల లోపు వారే అని, వారు పారిపోయారని, గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు లలిత్ అలియాస్ జానీని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.