దీపావళి రోజే దారుణం: టపాసులు కాలుస్తున్న యువకుడి దారుణ హత్య
భువనేశ్వర్: దీపావళి పండగను ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న వేళ ఒడిశా రాజధాని భువనేశ్వర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. టాపాసులు కాలుస్తున్నాడంటూ ఓ యువకుడిని కొంతమంది దారుణంగా హత్య చేశారు. దీపావళి పండగ రోజున ఈ ఘటన చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. భువనేశ్వర్ సమీపంలోని సుందర్పాడ ప్రాంతంలో అమరేశ్ నాయక్ తన స్నేహితులతో కలిసి ఇంటి ముందు టపాసులు పేల్చుతున్నాడు. బాణాసంచా కాల్చుతుండగా ఆ దారిలో వెళ్తున్న కొంత మంది అమరేశ్ వద్దకు వచ్చి టపాసులు కాల్చవద్దని చెప్పి, కాల్చకుండా అడ్డుకున్నారు. తనన అడ్డుకోవడంపై అమరేశ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలో వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది ఇరువర్గాల మధ్య గొడవకు దారితీసింది. 15 మంది వ్యక్తులు మూకుమ్మడిగా పదునైనా కత్తులతో అమరేశ్పై దాడికి పాల్పడ్డారు. దీంతో అమరేశ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు అతడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అయితే, అమరేశ్ అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
దీపావళి నాడు జరిగిన ఘటనల్లో పలు ప్రాంతాల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. కియోంజార్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి దీపావళి పటాసులు కాల్చుతున్న క్రమంలో ఇంట్లో మంటలు చెలరేగడంతో మరణించగా, భద్రక్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఇంటిని అలంకరించే సమయంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అనంతరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు.