అమ్మాయిల బాత్రూంలో కెమెరా పెట్టి వీడియోలు తీశాడు!: సోషల్ మీడియాలో పెట్టి వేధింపులు
బెంగళూరు: వికృత చేష్టలకు పాల్పడిన ఓ విద్యార్థిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. విద్యార్థినుల స్నానాల గదుల్లో కెమెరాలు పెట్టి.. ఆ వీడియోలను ఆధారంగా వారిని బెదిరింపులకు గురిచేశాడు నిందితుడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన సిద్ధార్థ(21) అనే ఇంజినీరింగ్ విద్యార్థి చూడసంద్ర వద్ద ఉన్న ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్లో ఉంటున్న అతను పక్క భవంతిలోని విద్యార్థినుల వసతిగృహం స్నానాల గదిలో కెమెరాను పెట్టాడు. అతని స్నేహితురాలే ఈ కెమెరాను అమర్చిందని ప్రాథమిక విచారణలో గుర్తించారు.
మొదట ఓ విద్యార్థినిని ప్రేమ పేరిట వంచించాడు. హోటల్ గదికి తీసుకెళ్లి ఆమెతో సన్నిహితంగా గడిపాడు. దాన్ని తన సెల్ఫోన్లో రికార్డు చేసుకున్నాడు. దాన్ని అడ్డు పెట్టుకుని, ఆమెను బెదిరింపులకు గురిచేశాడు. ఆమెతోనే అమ్మాయిల స్నానాల గదిలో రహస్య కెమెరాను పెట్టించాడని పోలీసుల విచారణలో తేలింది.
కెమెరాలో నమోదవుతున్న వీడియోలను సేకరించి.. వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఓ బాధిత విద్యార్థిని దీన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేపట్టి నిందితుడు సిద్ధార్థ్ను అరెస్ట్ చేశారు. ఇంకా ఎన్ని ఘోరాలకు పాల్పడ్డాడోననే విషయాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.