అమ్మాయిలపై రేప్లు, పవిత్రం కాదు: విచారణలో మజిద్, 300మంది...
న్యూఢిల్లీ/ముంబై: ఐఎస్ఐఎస్ భారతదేశంలో విస్తరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోందని ఎన్ఐఏ అదుపులో ఉన్న ఆరీఫ్ మజీద్ వెల్లడించాడు. ఎన్ఐఈ విచారణలో అతను పలు విషయాలను బహిర్గతం చేసినట్లుగా తెలుస్తోంది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా ఉగ్రవాద సంస్థలో (ఐఎస్ఐఎస్) చేరేవిధంగా తనను ప్రోత్సహించిన స్థానికుల పేర్లను మజీద్ చెప్పినట్లు ఎన్ఐఏ అధికారులు ఆదివారం తెలిపారు.
ఇసిస్తో సంబంధమున్న కళ్యాణ్కు చెందిన 22 ఏళ్ల ఆరిఫ్ మజీద్ను ఎన్ఐఏ శుక్రవారం అరెస్టు చేసి ముంబైకి తీసుకు వచ్చింది. భారత్కు చెందిన 300 మందికి పైగా ముస్లీం యువకులు ఉగ్రవాద సంస్థలో చేరేందుకు వెళ్లినట్లు మజీద్ వెల్లడించినట్లు తెలుస్తోంది.
వారు చేసేది పవిత్ర యుద్ధం కాదని, పవిత్ర గ్రంథమైన ఖురాన్లోని ప్రవచనాలను కూడా వాళ్లు పాటించడం లేదని, లెక్కలేనంతమంది అమ్మాయిలపై వాళ్లు అత్యాచారం చేస్తున్నారని ఇసిస్ ఉగ్రవాదులను ఉద్దేశించి మజీద్ వ్యాఖ్యానించాడని సమాచారం.
ఇసిస్లో చేరి తిరిగి వచ్చేసిన మజీద్ను ఎన్ఐఏ అధికారులు ఆదివారం విచారించారు. ఉగ్రవాద పోరాటం నుంచి తనను పూర్తిగా పక్కనపెట్టి మరుగుదొడ్లు కడగడానికి, ఉగ్రవాదులకు మంచినీళ్లు అందజేయడానికి ఎలా ఉపయోగించుకున్నారో వివరించాడని చెప్పారు. తనకు బుల్లెట్ గాయం తగిలిన తర్వాత కూడా మూడు రోజులపాటు పట్టించుకోలేదన్నాడు.
అంతేకాదు, ఆ గ్రూపు తనను ఎలా పూర్తిగా పక్కన పెట్టిందో కూడా వెల్లడించాడని, యుద్ద రంగంలోకి పంపించడానికి బదులు మరుగుదొడ్లు శుభ్రం చేయడం, వార్ జోన్లో ఉన్న వాళ్లకు తాగు నీరు అందించడం లాంటి పనులు చేయమని చెప్పేవారని అతను వెల్లడించినట్లు ఆ అధికారులు తెలిపారు.
మజీద్ను ఈ రోజు అనేక గంటల పాటు ప్రశ్నించామని, తనతో పాటు మరో ముగ్గురు స్నేహితులను తీవ్రవాదులుగా మార్చి, ఇరాక్ వెళ్లేందుకు తోడ్పడిన వారి పేర్లను అతను ఈ సందర్భంగా వెల్లడించాడు. అతను చెప్పిన మాటలను నిర్ధారించుకోవడానికి, ఆ లోకల్ కాంటాక్ట్లు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు.