రూపా గంగూలీకి వేధింపులు: ‘మమతా జిందాబాద్’ అంటూ నినాదాలు
బుర్ద్వాన్: భారతీయ జనతా పార్టీ ఎంపీ రూపా గంగూలీకీ కొందరు దుండగుల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. జాతీయ రహదారిపై వాహనదారుల దగ్గర నుంచి ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రశ్నించినందుకు ఆమెను పలువురు యువకులు వేధించారు. మహిళా ఎంపీ అని చూడకుండా ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని బుర్ద్వాన్లో చోటు చేసుకుంది.
కోల్కతాకు సమీపంలోని బోల్పూర్ వద్ద జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణమైన ఎంపీ రూపా గంగూలీ బుర్ద్వాన్ వద్ద ట్రాఫిక్లో చిక్కుకున్నారు. ఏమైందా? అని చూసేందుకు ఎంపీ కారు దిగి వచ్చారు. రెండో జాతీయ రహదారి వద్ద కొందరు యువకులు ట్రక్కు డ్రైవర్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.
గమనించిన ఆమె వెంటనే వారి వద్దకు వెళ్లి డబ్బు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఆమె అడిగిన దానికి యువకులు దురుసుగా సమాధానం చెప్పడంతో పాటు ఆమెపై ఎదురుదాడికి దిగారు.
'మేం డబ్బులు తీసుకుంటాం.. చేతనైతే ఆపి చూడు' అంటూ ఆమెతో దురుసుగా మాట్లాడారు. అంతటితో ఆగకుండా ఆ రాష్ట్ర సీఎం 'మమతా బెనర్జీ జిందాబాద్.. గో బ్యాక్ రూపా' అంటూ నినాదాలు చేశారు. అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది ఎంపీకి రక్షణగా నిల్చున్నారు. తనను వేధించిన యువకులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె పోలీసులను కోరారు. అనంతరం అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
ఇది ఇలావుంటే, బీజేపీ ఎంపీ అయిన రూపా గంగూలీ వివాదాస్పద చిత్రం 'పద్మావత్'కు మద్దతు తెలిపారు. సినిమాను నిషేధించాలంటూ చేస్తున్న నిరసనలను ఆమె తప్పుబట్టారు.