తీగ లాగారు..డొంకంతా కదిలింది: మూడేళ్ల కిందటి మర్డర్.. షాకింగ్ ట్విస్ట్: 13 ముక్కలుగా చేసి..
న్యూఢిల్లీ: పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనేది అల్లాటప్పాగా ఉండదు. ఎక్కడో ఆరంభిస్తారు.. అదెక్కడికో దారి తీస్తుంది. ఓ కేసులో విషయంలో పోలీసులు లాగిన ఓ చిన్న తీగకు మొత్తం డొంకంతా కదిలి వచ్చింది. కొన్ని అనూహ్య పరిణామాలకు దారి తీసింది. పోలీసులు సైతం షాక్ కు గురయ్యేంతటి ట్విస్టులకు ఆ కేసు దారి తీసింది. మొత్తం ఆరుమంది అరెస్టు అయ్యారు. దేశ రాజధానిలో చోటు చేసుకున్న ఉదంతం ఇది.
ఆచూకీ దొరక్క.. కేసు క్లోజ్..
న్యూఢిల్లీకి చెందిన 17 సంవత్సరాల యువకుడు మూడేళ్ల కిందట అదృశ్యం అయ్యాడు. అతని పేరు భరద్వాజ్. అందరూ ప్రిన్స్ అని పిలుస్తుంటారు. గీతా కాలనీలో నివసించే భరద్వాజ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేసినప్పటికీ.. భరద్వాజ్ కేసును మాత్రం ఛేదించలేకపోయారు. భరద్వాజ్ సజీవంగానే ఉండొచ్చని, ఉద్దేశపూరకంగా పారిపోయి ఉండవచ్చని నిర్ధారించారు. కేసును క్లోజ్ చేశారు.
అనూహ్యంగా..
రెండు రోజుల కిందట భరద్వాజ్ అదృశ్యమైన ఉదంతం హఠాత్తుగా తెరమీదికి వచ్చింది. కొన్ని ఊహించని పరిణామాలకు దారి తీసింది. శుక్రవారం రాత్రి పోలీసులు గీతా కాలనీలోని ఫ్లైఓవర్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. నలుగురు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద ఎత్తున గంజాయి లభించింది. దీనితో అరెస్టు చేశారు. గంజాయితో పాటు ఓ పిస్తోలు, బుల్లెట్లను నింపి ఉన్న ఓ క్యాట్రిడ్జ్ ను స్వాధీనం చేసుకున్నారు.
హత్య చేసింది వారే..
నిందితుల వద్ద మారణాయుధం లభించడం పోలీసులను దిగ్భ్రాంతికి గురి చేసింది. సాధారణంగా గంజాయి కేసుగా తీసుకోలేదు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అది కాస్తా ట్విస్టుల మీద ట్విస్టులకు దారి తీసింది. నేరుగా భరద్వాజ్ అదృశ్యం దగ్గర నిలిచిపోయింది. ఈ నలుగురితో భరద్వాజ్ మాయం కాలేదని, తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. భరద్వాజ్ తమ టీమ్ లీడర్ అని వారు వెల్లడించారు. గంజాయిని తరలించడంలో భరద్వాజ్ కీలక పాత్ర పోషించే వాడనే విషయం పోలీసులకు కూడా తెలియదు.
వాటాల వద్ద తేడా..
గంజాయిని స్మగ్లింగ్ చేసిన అనంతరం తమకు లభించే డబ్బుల విషయంలో పంపకాల్లో తేడా రావడం వల్ల తాము అతణ్ని హతమార్చినట్లు వెల్లడైంది. భరద్వాజ్ ను హత్య చేసిన తరువాత మృతదేహాన్ని 13 ముక్కలుగా కోసి.. యమునా నదీ తీరంలో పూడ్చి పెట్టినట్లు నిందితులు అంగీకరించారని షాదారా డీసీపీ అమిత్ శర్మ వెల్లడించారు. మృతదేహాన్ని పూడ్చేసిన స్థలానికి నిందితులను తీసుకెళ్లామని, సంఘటనాస్థలం నుంచి కొన్ని ఎముకలను స్వాధీనం చేసుకున్నామని, వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని అన్నారు. ఈ కేసులో మొత్తం ఆరుమందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.