చారిత్రాత్మక కేసుల్లో భాగస్వామ్యులుగా తండ్రి కొడుకులు: నాడు వైవీ చంద్రచూడ్..నేడు డీవై చంద్రచూడ్!
న్యూఢిల్లీ: చరిత్ర పునరావృతవం కావడం అంటే బహుశా ఇదేనేమో! రెండు అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన, చారిత్రాత్మకమైన కేసుల్లో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు భాగస్వామ్యులు కావడం అత్యంత అరుదైన ఘటనగా చెప్పుకోవచ్చు. ఈ రెండు కేసులు కూడా హిందూ ధార్మిక సంఘాలతో ముడిపడి ఉన్నవే.. చారిత్రాక నేపథ్యం ఉన్నవే కావడం మరో విశేషం. పైగా- సుప్రీంకోర్టు చరిత్రలోనే సుదీర్ఘకాలం పాటు నడిచినవిగా ముద్ర పడిన కేసుల్లో తండ్రి కొడుకులు పాలు పంచుకున్న అరుదైన ఘటన బుధవారం నాడు ఆవిష్కృతమైంది.
నాడు తండ్రి వైవీ చంద్రచూడ్..
కేరళకు చెందిన కేశవానంద భారతి కేసు సుప్రీంకోర్టులో కొనసాగుతున్న సమయంలో.. దీనిపై ఏర్పాటైన 13 మంది న్యాయమూర్తులు గల ధర్మాసనంలో కొనసాగారు యశ్వంత్ విష్ణు చంద్రచూడ్. కేశవానంద భారతి కేసు 68 రోజుల పాటు కొనసాగింది. 1973లో కేరళలోని కాసర్ గోడ్ జిల్లా ఎడ్నేర్ గ్రామంలో ఉన్న స్వామి కేశవానంద భారతి శ్రీపాదగల్వరు, కేరళ ప్రభుత్వం మధ్య కొనసాగిన ఈ కేసు విషయంలో ప్రభుత్వానికి మొట్టికాయలు వేసేలా వ్యవహరించిన న్యాయమూర్తుల్లో వైవీ చంద్రచూడ్ ఒకరు. కేశవానంద భారతి ఆశ్రమానికి చెందిన మఠాన్ని స్వాధీనం చేసుకున్న కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పును వెలువరించిన తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ఆయనా ఒకరు. మిగిలిన నలుగురు వ్యతిరేకించినప్పటికీ.. తీర్పుకు అనుకూలంగా సంతకాలు చేశారు వైవీ చంద్రచూడ్.
నేడు కుమారుడు డీవై చంద్రచూడ్!
వైవీ చంద్రచూడ్ కుమారుడే ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్. అత్యంత సంక్లిష్టంగా, కోట్లాదిమంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసుపై విచారణ నిర్వహించడానికి ఏర్పాటైన అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనంలో డీవై చంద్రచూడ్ ఒకరు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ తో పాటు ఎస్ ఏ బొబ్డే, అశోక్ భూషణ్, ఎస్ ఏ నజీర్ లతో కూడిన ధర్మాసనంలో చంద్రచూడ్ ఒకరు. తోటి న్యాయమూర్తులతో కలిసి విచారణను నిర్వహించారు. ప్రతి సున్నిత అంశాన్నీ నమోదు చేసుకున్నారు. విచారణ సందర్భంగా తనలో తలెత్తిన ప్రశ్నలకు సరైన సమాధానాలను రాబ్టట్టుకోగలిగారు.
తండ్రి హయాంలో 68 రోజులు..కుమారుడి హయాంలో 40 రోజులు..
తండ్రి వైవీ చంద్రచూడ్ హయాంలో చోటు చేసుకున్న కేశవానంద భారతి కేసు 68 రోజుల పాటు కొనసాగగా.. కుమారుడి హయాంలో సుప్రీంకోర్టులో దాఖలైన అయోధ్య భూ వివాదం కేసును 40 రోజుల పాటు విచారించాల్సి వచ్చింది. నాడు తండ్రి తరహాలోనే కుమారుడి వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. తండ్రి కొడుకులు భాగస్వామ్యమైన రెండు కేసులు కూడా హిందువులతో ముడిపడి ఉన్నవి కావడం కేవలం కాకతాళీయమే.
ధర్మాసనం వైఖరి ఏమిటన్నది తేలటానికి మరి కొన్ని రోజులు..
ఇక అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన కేసుపై 40 రోజుల పాటు విచారణ కొనసాగింది. అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం విచారణను కొనసాగించింది. అయోధ్యలో శ్రీరామచంద్రుడు జన్మించిన ప్రదేశంగా భావిస్తోన్న 2.77 ఎకరాల స్థలాన్ని రామ్ లల్లా విరాజ్ మాన్, నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డులకు సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈ కేసు దాఖలైంది. అప్పటి నుంచీ విచారణ కొనసాగుతూ వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 16వ తేదీ (బుధవారం) నాటికి విచారణను ముగిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ స్పష్టం చేయడం, చెప్పినట్టే విచారణను ముగించడం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. ఈ కేసులో ధర్మాసనం వైఖరి ఎలా ఉంటుందనేది తేలడానికి మరి కొన్ని రోజులు ఎదురు చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.