'దంగల్' అమ్మాయికి భద్రత: బలవంతపు సారీపై వెంకయ్య..
దంగల్ సినిమాలో నటించిన జైరా వసీంకు భద్రత కల్పిస్తామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ బుధవారం నాడు తెలిపారు.
న్యూఢిల్లీ: దంగల్ సినిమాలో నటించిన జైరా వసీంకు భద్రత కల్పిస్తామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ బుధవారం నాడు తెలిపారు. జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని కలవడం, ఆమె తనను స్ఫూర్తిగా తీసుకోవాలని ట్వీట్ పెట్టడం, ఆమెకు బెదిరింపులు రావడం తెలిసిందే.
జైరా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్లో క్షమాపణ కోరుతూ బహిరంగలేఖ పోస్ట్ చేసి తొలగించడంతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమెకు అండగా నిలిచారు.
నన్ను స్ఫూర్తిగా తీసుకోకండి: బలవంతంగా సారీ చెప్పిన 'దంగల్' అమ్మాయి
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జైరాపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, అవసరమయితే భద్రత కూడా కల్పించే ఏర్పాట్లు చేస్తుందని జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలోని యువత.. ముఖ్యంగా జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాదం నీడలో పెరిగే యువత తమ ప్రతిభతో ఎదిగితే వారిని అభినందించడం సమాజం బాధ్యత అన్నారు.
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా జైరా వసీంకు మద్దతుగా నిలిచారు. అసలు ఆమె క్షమాపణ ఎందుకు చెప్పాలన్నారు. తన రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రితో భేటీ అయినందుకు క్షమాపణ చెప్పాలా అన్నారు. దీనిని బట్టే సూడో లిబరల్స్ వివిధ సందర్భాలలో ఎలా స్పందిస్తారో అర్థమవుతోందన్నారు.