రూ.149 కోట్లు ఇచ్చి దాచిపెట్టమన్నాడు, జకీర్ నాయక్ కేసులో ఆసక్తికర అంశం
ముంబై: వివాదాస్పద ఇస్లాం మత ప్రచారకుడు జకీర్ నాయక్ కేసు విచారిస్తున్న పోలీసులకు మరో ఆసక్తికరమైన అంశం లభించింది. జకీర్ నాయక్ తన భాగస్వామికి భారీ మొత్తంలో డబ్బు అందజేసి దాచిపెట్టాలని కోరినట్లు తెలిసింది.
తనకు జకీర్ నాయక్ రూ. 148.9 కోట్లను దాచిపెట్టాలని ఇచ్చినట్టు ఆయన సహచరుడు, భాగస్వామి ఆమిర్ అబ్దుల్ మన్నన్ గజ్దార్ ఈడీ అధికారులకు తెలిపాడు. జకీర్ మేనేజర్ అస్లామ్ ఖురేషి తనకు ఈ డబ్బు ఇచ్చినట్లు పేర్కొన్నాడు.
మత ప్రచారం పేరు చెప్పి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, అక్రమంగా డబ్బు కూడబెట్టడం వంటి నేరాలపై జకీర్ తో పాటు ఆయన నిర్వహిస్తున్న ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్ పైనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
విచారణలో భాగంగా ఇటీవల అమీర్ ను అరెస్ట్ చేసి ప్రశ్నించగా, గత ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య తనకు ఈ డబ్బు అందిందని వెల్లడించాడు. తాను దశలవారీగా ఈ మొత్తాన్ని తిరిగి తీసుకు వెళతానని అన్నాడని, నిఘా అధికారులకు తనపై అనుమానం వచ్చిన తరువాత, డబ్బు తన వద్ద దాచిపెట్టమని కోరాడని తెలిపాడు.