అర్నబ్ గోస్వామికి జకీర్ నాయక్ షాక్ : 500కోట్ల పరువు నష్టం దావా
న్యూఢిల్లీ : వివాదస్పద ఇస్లాం ప్రవచనకర్తగా గతకొద్ది రోజులుగా వార్తల్లో నానుతున్న పేరు జకీర్ నాయక్. తాజాగా టైమ్స్ నౌ ఛానెల్ పై రూ. 500 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేసి మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ మారారు జకీర్ నాయక్.
ముఖ్యంగా టైమ్స్ నై ఛీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామి తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారని, విద్వేషాలు రెచ్చగొట్టే కథనాలు ప్రసారం చేశారని ఆరోపిస్తూ పరువు నష్టం దావా దాఖలు చేశారు జకీర్ నాయక్. దీనికి సంబంధించి జకీర్ తరుపు న్యాయవాది ముబిన్ సోల్కర్ టైమ్స్ నై ఛానెల్ కు నోటీసులు పంపించినట్లుగా సమాచారం.
అయితే టైమ్స్ నౌ తో పాటు మరో పది మీడియా సంస్థలపైన కూడా జకీర్ నాయక్ పరువు నష్టం దావా వేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే అర్నబ్ తన ప్రతిష్టను దిగజార్చారని ఆరోపించారు జకీర్. కాగా, ఢాకాలో ఉగ్రదాడి అనంతరం దాడితో సంబంధమున్న నిందితులు జకీర్ నాయక్ ప్రసంగాలతో ప్రభావితమైనట్లుగా బంగ్లా పోలీసులు నిర్దారించడంతో టైమ్స్ నౌ ఛానల్ దాన్ని హైలైట్ చేస్తూ వార్త కథనాలు ప్రసారం చేసింది. అయితే అవన్నీ నిరాధారం అంటున్నారు జకీర్ నాయక్.
జకీర్ నాయక్ పై చేసిన ఆరోపణలన్నింటిని ఉపసంహరించుకుని, క్షమాపణలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు జకీర్ తరుపు న్యాయవాది ముబిన్ సోల్కర్. ఇకపోతే ప్రస్తుతం జకీర్ నాయక్ సౌదీ అరేబియాలో ఉంటున్నట్లు సమాచారం. ఆయన పీస్ టీవీ ద్వారా ఇస్లాం మత బోధనలు చేస్తోన్న విషయం విదితమే.