పాక్కు మద్దతుగా సీరియల్: జీ గ్రూప్ 'జీ జిందగీ ఛానెల్' కు బీసీసీసీ నోటీసులు
న్యూఢిల్లీ: జీ గ్రూపుకు చెందిన జీ జిందగీ ఛానెల్కు కేంద్రం నోటీసులు పంపింది. జిందగీ ఛానెల్లో ప్రసారమయ్యే 'వక్త్ నే కియా క్యా హసీ సితాం' అనే సీరియల్పై ఫిర్యాదులు రావడంతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ సీరియల్లో దేశ విభజనపై పాకిస్ధాన్కి మద్దతుగా ఉందంటూ సదరు మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదులను మంత్రిత్వ శాఖ బ్రాడ్ కాస్ట్ కంటెంట్ కంప్లెయింట్స్ కౌన్సిల్ (బీసీసీసీ)కి పంపింది.
దీంతో, జస్టిస్ ముకుల్ ముద్గల్ నేతృత్వంలోని బీసీసీసీ కమిటీ వాటిని పరిశీలించిన తర్వాత జీ జిందగీ ఛానెల్ యాజమన్యానికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై మే 22న విచారణ ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే తమకు ఇంకా నోటీసులు అందలేదని జీ గ్రూపు అధికారి ఒకరు తెలిపారు. ఈ సీరియల్లో విభజన సమయంలో పాకిస్ధానీలను హీరోలుగా, భారతీయులను విలన్లుగా చూపించారని సమాచార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు అందాయి.
ఇది ఇలా ఉంటే సీరియల్లో నటిస్తున్న నటీనటులు కూడా పాకిస్ధాన్ వారు కావడం విశేషం. పాకిస్ధాన్కు చెందిన నటుడు ఫవాద్ ఖాన్, నటి సనమ్ బాలోచ్లకు భారత్లో కూడా పేరుండటంతో వీరిద్దరిని పెట్టి సీరియల్ తీశారు.