శెభాష్ నవీన్ పట్నాయక్, సమర్థంగా అంఫన్ తుఫాన్ ఎదుర్కోవడంతో నో డెత్, 18 నెలలో 5 తుఫాన్లు..
ఇటీవల అంఫన్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తూ.. తీరం దాటింది. దీని ప్రభావం పశ్చిమబెంగాల్పై ఎక్కువగా ఉంది. సీఎం మమతా బెనర్జీ పటిష్ట చర్యలు తీసుకున్నా.. 80 మంది పైచిలుకు మంది చనిపోయారు. అయితే అదే ఒడిశాలో మాత్రం ఒక్కరు కూడా చనిపోలేదు. బెంగాల్ కన్నా ఒడిశాలో ప్రభావం ఎందుకు చూపలేదంటే.. అక్కడ నవీన్ పట్నాయక్ సమర్థవంతంగా పనిచేయడమే.. ముఖ్యంగా తుఫాన్ ప్రభావం నుంచి ప్రజలను కాపాడటంపై నవీన్ అధ్యయనమే చేశారని చెప్పాలి. ఏ సైక్లోన్ వచ్చినా ఆస్తి నష్టం ప్రభావం ఉంటుంది.. కానీ ప్రాణ నష్టం అంతగా ఉండకుండా పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
1999లో తుఫాన్తో భారీ నష్టం
1999లో వచ్చిన తుఫాన్ ఒడిశాను అతలాకుతలం చేసింది. కానీ అప్పుడు ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ లేరు. 2000లో సీఎం పదవీ చేపట్టిన నవీన్.. తుఫాన్ సందర్భంగా ప్రజల ప్రాణాలను కాపాడుకోవడంపైనే ఫోకస్ చేశారు. గత 18 నెలలో ఐదు తుఫాన్లు ఒడిశాపై ప్రభావం చూపాయి. కానీ ఫణి తుఫాన్ తప్ప మిగతా అన్నింటిలో మృతుల సంఖ్య సింగిల్ డిజిట్ దాటలేదు. ఇక అంఫన్ సంగతి చెప్పక్కర్లేదు. ఒక్కరంటే ఒక్కరు చనిపోకుండా పటిష్ట జాగ్రత్తలు తీసుకున్నారు. 10 జిల్లాల్లో గల 89 బ్లాకులు, 1500 పంచాయతీల పరిధిలో గల 45 లక్షల మందిపై తుఫాన్ ప్రభావం చూపింది. కానీ అంతకన్నా ముందే వారిని పునరావాస శిబిరాలకు తరలించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో భీకరమైన ఈదరుగాలులతో భారీ వృక్షాలు సైతం నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూడా పడిపోయాయి. చేతికొచ్చిన పంట కూడా ధ్వంసమైపోయింది. పెంకుటిల్లు పై కప్పులు లేచిపోయాయి. కానీ ప్రజలను మాత్రం నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కాపాడగలిగింది.
వెంటనే అలర్ట్
తుఫాన్ గురించి వాతావరణ శాఖ హెచ్చరించిందో లేదో.. ఒడిశా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నది. ముందు జాగ్రత్త చర్య ప్రజలను తరలించింది. ఒడిశా విపత్తుల నిర్వహణ శాఖతో సమన్వయం చేసుకొని.. మరీ ప్రీకాషన్స్ తీసుకున్నారు. వెంటనే విపత్తుల నిర్వహణ శాఖకు అప్రమత్తం చేసి.. వెనువెంటనే పనులు చేపట్టారు. దీంతో తీరప్రాంతంలో ఉన్న లక్షన్నర మందిని కూడా తరలించడం సాధ్యమైంది. ఇప్పటికే కరోనా వైరస్ కోసం క్వారంటైన్ కేంద్రాలు ఉండగా.. తుఫాన్ ప్రభావిత ప్రజల కోసం షెల్టర్లను వెంటనే ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలుగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు.
నవీన్ ఉన్నారుగా...
తుఫాన్ వస్తోంది అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ చెప్పారని.. కానీ తుఫాన్ సందర్భంగా ఎలా పనిచేయాలో తెలిసిన నేత తమకు ఉన్నారని చీఫ్ సెక్రటరీ అసిత్ కుమార్ త్రిపాఠి పేర్కొన్నారు. ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కొవటంలో ఆయన దిట్ట అని.. ఏడాదిన్నరలో ఐదు తుఫాన్లను ఎదుర్కొన్నామని చెప్పారు.