భయం..భయం! 15 పోలింగ్ కేంద్రాల్లో ఒక్క ఓటూ పడలేదు!
భువనేశ్వర్: దేశవ్యాప్తంగా 91 లోక్ సభ నియోజకవర్గాల కోసం గురువారం నిర్వహించిన పోలింగ్ ముగిసింద. ఏపీతో పాటు ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లల్లో అసెంబ్లీ స్థానాలకు కూడా జమిలి ఎన్నికలను నిర్వహించారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు, 25 లోక్ సభ స్థానాలకు తొలిదశలోనే పోలింగ్ ముగిసింది. మే 23వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఎన్నికల వేళ! విశాఖ మన్యంలో మావోల అలజడి..శక్తిమంతమైన మందుపాతరలు!
ఒడిశాలో ఒక్క ఓటు కూడా పడని కేంద్రాలు వెలుగు చూశాయి. దీనికి ప్రధాన కారణం.. ఓటర్లలో నెలకొన్న భయం. మావోయిస్టులకు గట్టి పట్టు ఉన్న గ్రామాలు కావడంతో.. ఏ ఒక్కరు కూడా ఓటు వేయడానికి సాహసించలేదు. ఓటు వేస్తు, తమ ప్రాణాలు గాల్లో కలుస్తాయనే భయం వారిని ఆవహించడం వల్లే ఎవరూ ఓటు వేయలేకపోయారు.
మల్కాన్ గిరి జిల్లా పేరు తరచూ వార్తల్లోకి ఎక్కుతుంటుంది. మావోయిస్టులకు కంచుకోటగా చెప్పుకొనే జిల్లా అది. ఈ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతాల మధ్య ఉండే చిత్రకొండ, మథిలీ బ్లాక్ పరిధుల్లో గురువారం పోలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ.. గ్రామీణులు ఎవ్వరూ తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో- వారిని పిలుపును ఉల్లంఘించి, ఓటు వేయడం వల్ల ప్రాణాలకు ముప్పు ఉంటుందనే భయంతో వారు ఓటు వేయలేదు. వారి పరిస్థితిని గమనించిన పోలీసులు గానీ, ఎన్నికల సిబ్బంది గానీ వారిలో చైతన్యాన్ని కలిగించే ప్రయత్నమూ చేయలేదు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నందు వల్ల ఈ బ్లాకుల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ కొనసాగింది. పోలింగ్ ముగిసే సమయానికి ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు.