జీరోలు హీరోలను గుర్తించరు: రాహుల్ గాంధీపై వెంకయ్య వ్యాఖ్య
న్యూఢిల్లీ: కాంగ్రెసు నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. రాహుల్ ఎన్డియె ప్రభుత్వానికి జీరో మార్కులు ఇచ్చారని, జీరోలు హీరోలను గుర్తించరని, జీరోలకు జీరోలే కనిపిస్తాయని ఆయన ట్వీట్ చేశారు.
ప్రధాని మోడీ ప్రపంచమంతా తిరుగుతున్నారని, కానీ ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుబాలను పరామర్సించే తీరిక లేదని విమర్శించడం ద్వారా రాజకీయ వాతావరణాన్ని రాహుల్ గాంధీ వేడెక్కించారు. మోడీ ప్రభుత్వం రైతుల అవకాశాలను లాగేసుకుంటోందని వ్యాఖ్యానించారు. అమేథీ పర్యటనలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
మెగా ఫుడ్ పార్కును రద్దు చేయడం ద్వారా రైతులను దెబ్బ తీశారని, మోడీ ప్రతీకార రాజకీయాల నడుపుతున్నారని ఆయన విమర్శించారు. రైతుల సమస్యల పరిష్కారం విషయంలో మోడీకి పది మార్కులకు గాను సున్నా మార్కులే పడుతాయని ఆయన అన్నారు
పారిశ్రామికవేత్తల విషయంలో మోడీకి పదికి పది మార్కులు పడుతాయని ఆయన అన్నారు. తెలంగాణ పర్యటనలో కూడా ఇటీవల రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వంపై వాగ్బాణాలు విసిరారు.