ఏఐ ఎఫెక్ట్: 541 మంది ఉద్యోగులను తొలగించిన జొమాటో
న్యూఢిల్లీ: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మరోసారి వందలాది మంది ఉద్యోగులపై వేటేసింది. జొమాటో తమ సంస్థలో అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో 541మంది ఉద్యోగులను తొలగించింది. ఒకేసారి ఇంత భారీ మొత్తంలో ఉద్యోగులను తొలగించడం వారంతా దిక్కుతోచని పరిస్థితి పడ్డారు.
కస్టమర్ కేర్ ద్వారా వినియోగదారులు అడిగే ప్రశ్నలకు ఇక నుంచి ఆటోమేషన్ ద్వారానే సమాధానాలు చెప్పడం జరుగుతుందని జొమాటో పేర్కొంది. ఆర్డర్లు పెరిగినా వేగం పెరగని కారణంగానే తాము ఆటోమేషన్ను ఉపయోగించాల్సి వస్తోందని సంస్థ చెబుతోంది. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ పని జరుగుతోందని వెల్లడించింది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పిస్తామని, అందుకే సపోర్ట్ టీంలో దేశ వ్యాప్తంగా ఉన్న 541మందిని తొలగించామని తెలిపింది. ఉద్యోగులను తొలగించడం బాధ కలిగించే విషయమే అయినప్పటికీ తప్పడం లేదని పేర్కొంది. అయితే, వారికి 2-3నెలల సమయం ఇచ్చిన తర్వాతనే తొలగిస్తామని చెప్పుకొచ్చింది.
అంతేగాక, తొలగించిన సిబ్బంది కుటుంబసభ్యులకు 2020 జనవరి వరకు బీమా సౌకర్యం కల్పిస్తామని తెలిపింది. కాగా, ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్దేశించిన ప్రమాణాలను పాటించడం లేదని ఇటీవల జొమాటో 5వేల రెస్టారెంట్లను తమ జాబితా నుంచి తొలగించి సంచలనానికి తెరతీసింది. నాణ్యతా ప్రమాణాలుంటూనే తాము ఒప్పందాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది.