జొమాటో మరో ప్రయోగం: త్వరలో డ్రోన్ ద్వారా ఫుడ్ డెలివరీ, లక్నో స్టార్టప్ సహకారం
న్యూఢిల్లీ: జొమాటో ఫుడ్ డెలివరీ సర్వీస్ మరో వినూత్న ప్రయత్నంతో ముందుకు రానుంది. జొమాటో వచ్చిన కొత్తలోనే భారీ ఆఫర్లు ఇచ్చింది. ఇక నుంచి డ్రోన్ల ద్వారా మీరు ఆర్డర్ చేసిన పిజ్జాలు లేదా ఇతర ఆహార పదార్థాలు మీ వద్దకు వస్తాయి! జొమాటో డ్రోన్ సర్వీస్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ మేరకు జొమాటో బుధవారం నాడు ప్రకటన చేసింది. లక్నోకు చెందిన స్టార్టప్ టెక్ ఈగల్ ఇన్నోవేషన్ను కొనుగోలు చేసినట్లు జొమాటో వెల్లడించింది. దీనిని ఎంతకు కొనుగోలు చేసింది చెప్పలేదు. భారత్లో డ్రోన్లతో ఆహార పదార్థాల డెలివరీ కోసం దీనిని తీసుకున్నట్లు చెప్పారు.
టెక్ ఈగల్ సహకారం
ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలను హైబ్రిడ్ మల్టీ రోటర్ డ్రోన్ల ద్వారా మరింత వేగంగా డెలివరీ చేసేందుకు టెక్ ఈగల్ సహకారం ఉంటుందని జొమాటో వెల్లడించింది. టెక్ ఈగల్ సంస్థను ఎంతకు కొనుగోలు చేసింది, అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు.
ప్రాథమిక దశలో ఉన్నాం
టెక్ ఈగల్ సంస్థ కొనుగోలు, డ్రోన్ డెలివరీపై జొమాటో ఫౌండర్ అండ్ సీఈవో దీపిందర్ గోయల్ మాట్లాడుతూ... ఏరియల్ ఇన్నోవేషన్ (డ్రోన్లతో డెలివరీ) విషయంలో ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నామని, రేపటి కోసం అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఆన్ లైన్ ద్వారా ఆహార పదార్థాలు ఆర్డర్ చేసే వారు ముందు ముందు డ్రోన్ ద్వారా సరఫరాను చూడవచ్చునని చెప్పారు.
ఫుడ్ డెలివరీ
రోబోట్ ఇండస్ట్రీ వేగంగా పుంజుకుంటోందని, భవిష్యత్తులో దీని అవసరం ఆవశ్యమని భావిస్తున్నామని ఆయన చెప్పారు. తమ ఫుడ్ డెలివరీ వ్యాపారం మొత్తం ఆదాయంలో 65 శాతం కలిగి ఉందని ఆయన చెప్పాురు.
లక్నోకు చెందిన టెక్ ఈగల్
కాగా, టెక్ ఇగల్ లక్నోలో ఓ స్టార్టప్ కంపెనీ. టీ డెలివరీకి ఇది ఏకంగా డ్రోన్ తయారు చేసింది. టీ ఆర్డర్ చేస్తే చాలు డ్రోన్ గాలిలో ఎగురుకుంటూ వచ్చి వేడి వేడి టీని మీ చేతికి ఇస్తుంది. ఇప్పుడు జొమాటో కూడా దానిని తీసుకొని అదే దారిలో నడుస్తోంది.