ఇండోనేసియా భారీ భూకంపం, సునామీ: జైళ్ల నుంచి 1200 ఖైదీలు పరారీ
జకర్తా: ఇండోనేసియాలో భారీ భూకంపం, సునామీ పెను బీభత్సం సృష్టించింది. 832 మందికి పైగా మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. భూకంపం, సునామీ కారణంగా పోలీసులు సహాయక చర్యల్లో ఉన్నారు. మరోవైపు జైళ్లలోని ఖైదీలు 1200 మంది వరకు పారిపోయారు.
ఇండోనేసియా హీరో: భూకంపం ధాటికి టవర్ ఊగుతున్నా వందలాదిమందిని కాపాడి, మృతి
ఈ మేరకు ఇండోనేసియా న్యాయ శాఖ మంత్రి సోమవారం తెలిపారు. సునామీ సంభవించిన పాలూ నగరంలో జైలు గోడలు కూలిపోవడంతో ఖైదీలు అక్కడి నుంచి పారిపోయారు. నీరు పెద్ద ఎత్తున జైళ్లలోకి వచ్చింది. దీంతో ఖైదీలు రోడ్ల మీదకు పరుగులు తీశారు.
ఆ తర్వాత భూకంపం భయంతో చాలామంది ఖైదీలు పారిపోయారని, ఇది ఖైదీల చావుబతుకులకు సంబంధించిన విషయమని ఆయన అన్నారు. మరో చోట ఖైదీలు జైలు మెయిన్ గేటు ధ్వంసం చేసి పారిపోయారని చెప్పారు. ఓ జైలులో మంటలు రావడంతో 343 ఖైదీలు తప్పించుకున్నారని చెప్పారు.
పాలూ నగరంలోని రెండు జైళ్లలో కేవలం వందమంది మాత్రమే ఖైదీలు ఉన్నారని మంత్రి చెప్పారు. అయితే సునామీ కారణంగా భారీ నష్టం జరగడంతో అక్కడి భద్రతా సిబ్బంది ఖైదీలకు ఆహారం అందించేందుకు ఎంతో కష్టపడాల్సి వస్తోంది.