షాకింగ్ స్టడీ: 2030 నాటికి భారత్లో 17 లక్షల మంది పిల్లలు ఈ వ్యాధితో మృతి చెందుతారట
మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా..? వారి ఆరోగ్యంపై మీరు శ్రద్ధ వహిస్తున్నారా.. లేక మీరు బిజీగా ఉంటూ వారి సంగతి మరుస్తున్నారా..? తల్లిదండ్రులుగా వారి ఆరోగ్యం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. లేదంటే వారు అనారోగ్యంపాలు అయ్యే అవకాశం ఉంది. అవును చిన్నపిల్లలను ఇప్పుడు న్యూమోనియా జబ్బు తెగ వేధిస్తోందని ఓ పరిశోధన తెలిపింది. అంతేకాదు ఈ జబ్బు వచ్చిన చాలా మంది పిల్లలు మృతి చెందినట్లు కూడా పరిశోధన వెల్లడించింది.
చిన్నారుల పాలిట శాపంగా మారిన న్యూమోనియా వ్యాధి
న్యూమోనియా... ఇది ఊపిరితిత్తులకు సోకే భయంకరమైన ఇన్ఫెక్షన్. బ్యాక్టీరియా, వైరస్, ఫంగై,ఇతరత్ర పరాన్నజీవులనుంచి సంక్రమిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ న్యుమోనియా వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు ఓ అంతర్జాతీయ సంస్థ జరిపిన పరిశోధనల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2030 నాటికల్లా భారత దేశంలో 17 లక్షల మంది చిన్న పిల్లలు ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందుతారని జోస్యం చెప్పింది. ఇందులో 11 లక్షల మంది చిన్నారులు ఐదేళ్లు లోపు వారే ఉంటారని అంచనా వేసింది. దీనికి సంబంధించిన నివేదిక ప్రపంచ న్యుమోనియా దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది.
వ్యాక్సిన్లు పోషకాహారం ద్వారా న్యూమోనియాకు చెక్ పెట్టొచ్చు
ఇక న్యూమోనియా జబ్బు బారిన పడుతున్న పిల్లల్లో ఎక్కువగా నైజీరియా, భారత్, పాకిస్తాన్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశాలకు చెందినవారున్నట్లు నివేదిక తెలిపింది. అంతేకాదు న్యూమోనియా వ్యాధిని అరికట్టే మార్గాలు కూడా రిపోర్ట్ వెల్లడించింది. ఎక్కువగా వ్యాక్సినేషన్లు పంపిణీ చేయడంతో పాటు, సమయానికి చికిత్స అందించడం, సరైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ మహమ్మారికి చెక్ పెట్టొచ్చని నివేదిక వెల్లడించింది. మలేరియా, డయేరియా, తట్టుతో కలిపి ఎంతమంది చిన్నారులైతే ప్రపంచ వ్యాప్తంగా మృతి చెందుతున్నారో అంతకంటే ఎక్కువ మంది చిన్నారులు ఒక్క న్యూమోనియా వ్యాధితోనే మృతి చెందుతున్నట్లు పరిశోధనలో తేలినట్లు వారు చెప్పారు. దాదాపు 8 లక్షల 80వేల మంది చిన్నారులు ఎక్కువగా రెండేళ్ల వయసున్న వారు ఒక్క 2016లోనే న్యుమోనియాతో మృతిచెందినట్లు తమ వద్ద సమాచారం ఉందని వెల్లడించింది.
న్యూమోనియాపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి
న్యుమోనియాను తరిమి కొట్టేందుకు అన్ని వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం నిర్లక్ష్యంతో ప్రతి ఏటా ఈ వ్యాధి బారిన పడి చాలామంది చిన్నారులు మృతి చెందుతున్నారని సేవ్ చిల్డ్రన్ సంస్థ సీఈఓ పాల్ రొనాల్డ్స్ చెప్పారు. అందుబాటులో వ్యాక్సిన్లు, యాంటీబయోటిక్స్ ఉన్నప్పటికీ విస్మరిస్తున్నామని ఆయన ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే ప్రతి వ్యాధిపై అవగాహన కల్పించేందుకు పింక్ రిబ్బన్, ప్రపంచ స్థాయి సదస్సులు జరుగుతాయని అదే న్యూమోనియా విషయంలో అవగాహన కార్యక్రమాలు ఎందుకు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని న్యూమోనియాపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
న్యూమోనియాతో ఏదేశంలో ఎంత మంది చనిపోయే అవకాశం ఉంది..?
2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా 10కోట్ల 86లక్షల 5వేల728 మంది చిన్నారులు న్యూమోనియా వ్యాధితో మృతి చెందే అవకాశం ఉందని పరిశోధకులు చెప్పారు. ఇందులో నైజీరియాలో 17లక్షల 30వేలు, భారత్లో 17 లక్షల 10 వేల మంది, పాకిస్తాన్లో 7లక్షల ఆరువేలు, కాంగోలో 6లక్షల 35 వేల మంది మృతి చెందే అవకాశం ఉన్నట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ 90 శాతం మంది పిల్లలకు చేరవేస్తే ఐదేళ్ల లోపు వయస్సున్న 6 లక్షల 10 వేలమంది చిన్నారులను కాపాడొచ్చని పరిశోధకులు తెలిపారు. ఇక యాంటిబయోటిక్స్ ద్వారా 19 లక్షల మందిని రక్షించే అవకాశం ఉందని చెప్పారు. ఇక పిల్లలకు సరైన ఆహార పోషకాలు అందించడం ద్వారా 2.5 మిలియన్ మందిని రక్షించే అవకాశం ఉందని అంచనా వేశారు.