యూస్: పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు: ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
లాస్ఏంజెల్స్: అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. లాస్ఏంజెల్స్లోని అజుసా పోలింగ్ కేంద్రం వద్ద దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఎన్నికలు: 68-48తో ట్రంప్ కంటే హిల్లరీ ముందంజ
క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు భారీగా మోహరించారు. తాత్కాలికంగా పోలింగ్ నిలిపివేశారు. సమీపంలోని పోలింగ్ కేంద్రాలను కూడా మూసివేసి.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
కాగా, ఈ కాల్పులకు పాల్పడింది ఓ మహిళగా గుర్తించారు పోలీసులు. భారీగా ఆయుధాలతో వచ్చిన ఆమె.. కాల్పులకు తెగబడినట్లు తెలిపారు. అయితే, మరికొందరు కాల్పులు జరిపింది పురుషుడేనని పేర్కొంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ ఘటన మంగళవారం సాయంత్రం 5.30గంటలకు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
పోలీసులపై కూడా 20రౌండ్ల కాల్పులు జరిపినట్లు అజుసా పోలీస్ చీఫ్ స్టీవ్ హంట్ తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు ఓ ఇంట్లో దూరాడని చెప్పారు. నిందితుడి కోసం వేట కొనసాగుతోందని తెలిపారు.